NTV Telugu Site icon

ఆఫ్ఘన్‌ సంక్షోభం: ఐక్యరాజ్యసమితికి అమ్రుల్లా స‌లేహ్‌ లేఖ

ఆఫ్ఘనిస్థాన్‌ సంక్షోభం కొనసాగుతూనే ఉంది.. ఓవైపు పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు ప్లాన్‌ చేస్తుండగా.. మరోవైపు.. పంజ్‌షీర్‌లో తాలిబన్లకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది… అయితే, ఆఫ్ఘన్‌ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తానే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్‌ కూడా ఆఫ్ఘన్‌ను వీడారు.. అధ్యక్షుడు లేని సమయంలో నిబంధనల ప్రకారం తానే తాత్కాలిక అధ్యక్షుడిని అని ప్రకటించుకుని పంజ్‌షీర్‌ వెళ్లిన ఆయన.. తాలిబన్లపై పోరాటానికి పంజ్‌షీర్‌ ప్రజలు, అక్కడి ప్రజలు, ఆప్ఘన్‌ సైన్యం కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. అయితే, దేశాన్ని వీడిన తర్వాత ఇప్పుడు ఐక్యరాజ్య స‌మితికి ఓ లేఖ రాశారు. పంజ్‌షీర్‌లో మార‌ణ‌హోమం జ‌ర‌గ‌బోతోంది.. ద‌య‌చేసి ఆపాలంటూ లేఖలో వేడుకున్నారు. ఐక్యరాజ్య సమితికి తాను రాసిన లేఖను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు అమ్రుల్లా సలేహ్‌.. అక్కడ మాన‌వతావాద విప‌త్తు సంభ‌వించ‌బోతోంద‌ని.. ఈ సంక్షోభంపై ఐక్యరాజ్య స‌మితితోపాటు ఇత‌ర అంత‌ర్జాతీయ ఏజెన్సీలు వేగంగా స్పందించాల‌ని విజ్ఞప్తి చేశారు.

ఇక, ఆఫ్ఘన్‌ రాజధాని కాబూల్‌ సహా దేశంలోని ఇత‌ర న‌గ‌రలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత సుమారు రెండున్నర లక్షల మంది మ‌హిళ‌లు, వృద్ధులు, పిల్లలు పంజ్‌షీర్ లోయ‌ల్లో తలదాచుకున్నారని లేఖలో పేర్కొన్నారు అమ్రుల్లా సలేహ్‌.. వాళ్లను ఇప్పుడే కాపాడ‌లేక‌పోతే పెద్ద మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌, మాన‌వ‌తావాద విప‌త్తు సంభ‌వించే ప్రమాదం ఉందని ఆవేదిన వ్యక్తం చేశారు.. ఆక‌లికేక‌ల‌తో చ‌నిపోవ‌డంతోపాటు పెద్ద ఎత్తున‌ మార‌ణ‌హోమం జ‌రిగే అవకాశాలు కూడా క‌నిపిస్తున్నాయంటూ తన లేఖలో రాసుకొచ్చారు. ఇప్పటికే ఆఫ్ఘన్‌ ప్రకృతి విపత్తలు, కోవిడ్‌ను ఎదుర్కొంటోంది.. దేశం తిరిగి తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డంతో ప్రపంచంలోనే అతిపెద్ద మాన‌వ‌తావాద సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.