Early Menopause: 40ఏళ్లలోపే పీరియడ్స్ ఆగిపోతున్నాయా? లాన్సెట్ నివేదికలో కీలక విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Explained: మహిళల ఆరోగ్యం విషయంలో మరో ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు తోడు.. ఇప్పుడు మరో పెను ప్రమాదం మహిళలను వెంటాడుతోంది. సాధారణంగా వయసు పైబడిన తర్వాత రావాల్సిన మెనోపాజ్ సమస్య.. ఇప్పుడు చాలా త్వరగా వచ్చేస్తోంది. 40 ఏళ్ల కంటే ముందే మెనోపాజ్ వస్తే.. గుండెపోటు.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ముప్పు ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ మహిళల్లోనే ఎక్కువగా ఉండటం మరింత భయపెడుతోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? లాన్సెట్ తాజా నివేదిక ఏం చెబుతోంది? వైద్యులు చేస్తున్న హెచ్చరికలు ఏంటి?
విమెన్స్ హెల్త్ రీసెర్చ్ ఏం చెబుతోంది?
మారుతున్న జీవనశైలితో పాటే మహిళల ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమవుతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మెనోపాజ్ గురించి. రుతుక్రమం శాశ్వతంగా ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటారు. ఇది ఒకప్పుడు 50 ఏళ్ల వయసులో వచ్చేది.. కానీ ఇప్పుడు చాలా మంది మహిళల్లో 40 ఏళ్ల కంటే ముందే మెనోపాజ్ వస్తోంది. ఇలా త్వరగా మెనోపాజ్ బారిన పడుతున్న మహిళలకు గుండె సంబంధిత వ్యాధులు.. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ది లాన్సెట్ గైనకాలజీ.. విమెన్స్ హెల్త్ రీసెర్చ్ హెచ్చరిస్తోంది.
ఈ అధ్యయనం కోసం పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలకు చెందిన లక్షా 11 వేల 600 మంది మహిళల ఆరోగ్య వివరాలను సేకరించి విశ్లేషించారు. దీంట్లో 40 నుంచి 44 ఏళ్ల మధ్య మెనోపాజ్ వచ్చిన మహిళల్లో.. 45 ఏళ్ల వయసులో వచ్చిన వారితో పోలిస్తే హార్ట్ ఎటాక్ ముప్పు 30 నుంచి 40 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తక్కువ వయసులోనే రుతుక్రమం ఆగిపోవడం వల్ల శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పులే గుండెపై ఇంతలా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సైంటిస్టులు నిర్ధారించారు.
Also Read
మెనోపాజ్కి గుండెపోటుకు లింకేంటి?
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఈ పరిశోధనలో 7 వేల 872 మంది భారతీయ మహిళల డేటాను కూడా తీసుకున్నారు. మన దేశంలో సగటున 44.6 ఏళ్ల వయసులో మహిళలకు మెనోపాజ్ వస్తోంది. సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 43.6 శాతం మందికి ముందే మెనోపాజ్ వచ్చినట్లు తేలింది. వీరిలో 18.4 శాతం మందికి చాలా త్వరగా.. అంటే 40 ఏళ్ల లోపే రుతుక్రమం ఆగిపోగా… 25.3 శాతం మందికి 40 నుంచి 44 ఏళ్ల మధ్య మెనోపాజ్ వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరందరికీ భవిష్యత్తులో గుండెపోటు వచ్చే రిస్క్ చాలా ఎక్కువన్నది పరిశోధన సారాంశం.
ముందే మెనోపాజ్ రావడం వల్ల గుండెపోటు ఎందుకు వస్తుందన్న ప్రశ్నకు వైద్యులు వివరణ ఇస్తున్నారు. మెనోపాజ్ రాకముందు మహిళల శరీరంలో ఉత్పత్తి అయ్యే స్త్రీ హార్మోన్లు.. వారి గుండెను, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతూ రక్షిస్తాయి. మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈ హార్మోన్ల రక్షణ కవచం తొలగిపోతుంది. అప్పటివరకు గుండెకు ఉన్న ఆ రక్షణ పోవడంతో.. పురుషులతో సమానంగా మహిళలకు కూడా గుండెపోటు వచ్చే రిస్క్ విపరీతంగా పెరుగుతుందట.
అసలు ఇంత త్వరగా మెనోపాజ్ రావడానికి కారణాలు కూడా పరిశోధకులు స్పష్టంగా చెప్పారు. వాతావరణ కాలుష్యం, స్మోకింగ్, డయాబెటిస్ లాంటివి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఇతరులు తాగే సిగరెట్ పొగ పీల్చడం వల్ల త్వరగా మెనోపాజ్ వచ్చే ప్రమాదం ఉంది. పాలిష్ పట్టిన బియ్యం.. జంక్ ఫుడ్ తినడం.. పండ్లు, కూరగాయలు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. దానికి తోడు మానసిక ఒత్తిడి.. నిద్రలేమి.. అతిగా వ్యాయామం చేయడం.. పూర్తిగా వ్యాయామం చేయకపోవడం లాంటివి మహిళల పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల పెరుగుతున్న వేడి… అండాశయాల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయి.
మన దేశంలో మారుతున్న జీవన విధానమే మహిళల ఆరోగ్యం పాలిట శాపంగా మారుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు కార్డియో మెటబాలిక్ వ్యాధులు పెరుగుతున్నాయి. దీన్ని నివారించాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. సామాజిక… పర్యావరణ ఒత్తిళ్ల నుంచి మహిళలను రక్షించుకుంటేనే.. వారి గుండెను కాపాడుకోగలం. ప్రతిరోజూ పౌష్టికాహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కాలుష్యానికి సాధ్యమైనంత దూరంగా ఉండటం ఎంతో ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
-
LPG Cylinders: వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు అధికారుల అత్యవసర హెచ్చరిక
-
Ind vs Eng Playing XI: తప్పక గెలవాల్సిందే.! నేడు భారత్, ఇంగ్లాండ్ నాల్గవ టీ20.. ప్లేయింగ్ XI ఇదే..
-
Suman: రీల్ హీరో కాదు.. రియల్ హీరో! సైనికుల కోసం సుమన్ చేసిన గొప్ప త్యాగం ఏమిటో తెలుసా?
-
Rishab Shetty : రిషబ్ శెట్టిని ఆ నిర్మాణ సంస్థ మోసం చేసిందా?
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..