పెద్దపల్లి జిల్లాలో దారుణం ఉంది. హాస్పిటల్ బాత్రూమ్ లో ఒక బాలింత ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..రొంపికుంటకు చెందిన ఉమ అనే మహిళకు 2009లో వివాహం జరిగింది. ఎన్నో ఏళ్ళ తర్వాత ఈ ఏడాదే ఆమె గర్భం దాల్చింది. డిసెంబర్ 11న ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన ఆమె మరుసటి రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీసిన వైద్యులు ఆమెకు కుట్లు వేసి 10 రోజులు హాస్పిటలోనే ఉండాలని సూచించారు.
అయితే గత 10 రోజులలో వైద్యులు రెండుసార్లు కుట్లు వేసినప్పటికీ ఆ గాయాలు మానడం లేదు. దీంతో సోమవారం మళ్లీ ఆమెకు కుట్లు వేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆ గాయాల బాధ తట్టుకోలేని ఆమె ఆదివారం తెల్లవారుజామున హాస్పిటల్ బాత్రూమ్ లో ఆత్మహత్య చేసుకొంది. ఉదయం బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చిన సిబ్బంది అక్కడ మృతదేహాన్ని చూసి ఖంగుతిన్నారు. ఈ సిజేరియన్ గాయాల నొప్పి భరించలేక ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వలనే తన భార్య మృతిచెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
