ఎస్బీఐ బ్యాంకులోకి చొరబడి ఇద్దరు దుండగులు బీభత్సం సృష్టించారు. ముసుగులు ధరించి బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు బ్యాంకులోవారిని బెదిరించడానికి ఒక ఉద్యోగిపై కాల్పులు కూడా జరిపారు. దీంతో సదరు ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాకుండా మిగితా బ్యాంకు ఉద్యోగులను బెదిరించి 2.5 లక్షల నగదును కూడా దోచుకెళ్లిన ఘటన ముంబాయిలోని దహిసర్ వెస్ట్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో చోటు చేసుకుంది.
బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దోపిడీ గురించి పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బ్యాంకులోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.