Murder Case: ఒడిశాలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. బొలాంగీర్ జిల్లాలోని దేవ్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బగ్దా గ్రామంలో 40 ఏళ్ల వ్యక్తిని హత్య చేసి, తలను మొండెం నుంచి వేరు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు శత్రుఘ్న సాహూతో పాటు మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడిని తుసురా పోలీస్ స్టేషన్ పరిధిలోని తెబడముండా గ్రామానికి చెందిన సంతోష్ ఖార్సెల్గా గుర్తించారు.
భోజనానికి పిలిచి దారుణ హత్య:
బొలాంగీర్ ఎస్పీ జీ. అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు శత్రుఘ్న సాహూ ఆగస్టు 18న సంతోష్ను భోజనం చేసేందుకు తన ఇంటికి పిలిచారు. సంతోష్ నిద్రపోయిన తర్వాత సాహూ, అతడి సహచరులు కలిసి అతడిపై దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం పదునైన ఆయుధంతో సంతోష్ తలను మొండెం నుంచి వేరు చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం సంతోష్ మృతదేహాన్ని గ్రామం వెలుపలికి తీసుకెళ్లి ఓ చెరువులో పడేశారు. అయితే తెగిపోయిన తలను మాత్రం సాహూ ఇంట్లోని పూజా గదిలో దాచినట్లు పోలీసులు గుర్తించారు. గురువారం స్థానికులు చెరువు వద్ద తల లేని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
చిక్కిన నిందితుడు:
దర్యాప్తులో భాగంగా సంతోష్ చివరిసారిగా శత్రుఘ్న సాహూతో కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సాహూ ఇంటికి వెళ్లి విచారించారు. ఆ సమయంలో సాహూ ఇంట్లో ధ్యానం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత మద్యం సేవించే విషయంలో జరిగిన గొడవ కారణంగానే సంతోష్ను హత్య చేసినట్లు సాహూ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే మరింత లోతుగా విచారించగా.. సంతోష్ తెగిపోయిన తలను పూజా గదిలో దాచినట్లు అతడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు చూపించిన ప్రదేశంలో పోలీసులు తవ్వకాలు చేపట్టి సంతోష్ తలను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన రక్తంతో తడిసిన పదునైన ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మంత్రాల కోసమే హత్య?
ఈ హత్య వెనుక మూఢనమ్మకాలు, తంత్ర-మంత్రాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనకు దూరమైన భార్యను తిరిగి తన వద్దకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే సాహూ ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. సాహూ భార్య గత సుమారు పదేళ్లుగా తన కుమారుడు, కుమార్తెతో కలిసి అతడికి దూరంగా ఉంటోంది. భార్యను తిరిగి తన వద్దకు రప్పించుకోవాలనే నమ్మకంతో సాహూ నరబలికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య పథకాన్ని సాహూ ఒక్కడే రూపొందించాడా? లేక మరికొందరి సహకారం ఉందా? అనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. సాహూ తల్లి, సోదరుడు, వదినను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రధాన నిందితుడు విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ అభిలాష్ తెలిపారు. నిందితుడి ఇంటి నుంచి మృతుడి తలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించిన పోలీసులు.. హత్య జరిగిన తీరును తెలుసుకునేందుకు క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేపట్టారు.

