తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని చింతపల్లి మండలం దేవతపల్లి గేట్ సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన ఒక లారీ, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో స్పాట్లోనే నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాల్లో ఈ వార్త తీరని శోకాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం వారిని తక్షణమే హైదరాబాద్లోని నిమ్స్ లేదా ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
Also Read:10th Exams: పదో తరగతి పరీక్ష రాయకుండా హైదరాబాద్ వెళ్లిపోయిన విద్యార్థి.. కారణం ఏంటంటే..
ప్రాథమిక సమాచారం మేరకు.. మితిమీరిన వేగం లేదా డ్రైవర్ అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. దేవతపల్లి గేట్ వద్ద మలుపు ఉండటం, అదే సమయంలో లారీ వేగంగా రావడంతో ఆటోను తప్పించే అవకాశం లేకుండా పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతులు ఎవరు..? వారు ఎక్కడి నుంచి వస్తున్నారు? అనే పూర్తి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రహదారులపై పెరుగుతున్న ఇలాంటి ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే మలుపుల వద్ద డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని పూర్తి స్థాయి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.