Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య

  • ముంబై చెంబూర్‌లో దారుణ ఘటన
  • ప్రియురాలిపై అనుమానంతో విషం ఇచ్చిన యువకుడు
  • కూల్‌డ్రింక్‌లో విషపూరిత మాత్రలు కలిపినట్లు ఆరోపణ
Crime

Crime

Mumbai: ముంబైలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రియురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. కూల్ డ్రింక్‌లో విషం కలిపి యువతిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన చెంబూర్ ప్రాంతంలో జరిగింది. మృతురాలిని 19 ఏళ్ల విష్ణుమాయగా పోలీసులు గుర్తించారు. ఆమె చనిపోయిన తర్వాత రెండున్నర నెలల గర్భవతిగా తేలింది. ఈ కేసులో ప్రియుడు 25 ఏళ్ల ఆశిష్ మగర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, 5 రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు.

ఆగస్టు 25న ఆశిష్ తన ప్రియురాలిని వేరే వ్యక్తితో చూశాడు. దీంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే సమయంలో ఆశిష్ , విష్ణుమాయకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చాడు. ఆమె తాగిన తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంది. సాధారణ అనారోగ్య సమస్యగా కుటుంబం భావించింది. పరిస్థితి విషమించడంతో ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

పోస్టుమార్టం నివేదికలో విష్ణుమాయ విషం తీసుకోవడం వల్లే మరణించినట్లు తేలింది. దీంతో పోలీసుల దర్యాప్తులో హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆశిష్‌తో ఆమెకు ఉన్న సంబంధం, రెండు రోజులు ముందు గొడవ విషయం పోలీసులకు తెలిసింది. ఇదే కాకుండా విష్ణు మాయ స్పృహ కోల్పోయే ముందు తాను ఆశిష్ ఇచ్చిన కూల్ డ్రింక్ తాగినట్లు చెప్పింది. విచారణ సమయంలో పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు ఆశిష్ కట్టుకథలు చెప్పారు. అయితే, దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఆధారాలు బయటపడినట్లు పోలీసులు తెలిపారు.