Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!

Markapuram

Markapuram

Shocking Murder Case: అప్పుల్లో ఉన్న ఓ బామ్మర్ది తన బావను సాయం అడిగాడు. సొంత బావ కదా ఏదో ఒక విధంగా ఆదుకుంటాడని ఆశపడ్డాడు బామ్మర్ది. సాయం చేయడం కుదరకపోతే కుదరదని చెప్పొచ్చు.. మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవచ్చు. కానీ ఆ సాయం అడిగినందుకే సొంత బామ్మర్ది ప్రాణం తీసేశాడు. ఉన్న ఆస్తి మొత్తం సొంతం చేసుకుందామనే దురాలోచనతో సొంత బామ్మర్దిని ముక్కు నోరు మూసి దారుణంగా హత్య చేసి కటకటాల్లోకి వెళ్లాడు ఓ కన్నింగ్ బావ. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన సంచలనం రేకెత్తించింది. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 12న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తొలుత అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును.. పక్కా ప్లాన్డ్ మర్డర్‌గా గుర్తించారు. సొంత బామ్మర్దిని బావ హత్య చేసినట్టు నిర్థారించారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

జులై 12న త్రిపురాంతకం మండలంలోని మిట్టపాలెం నుంచి చెన్నంపల్లి గ్రామాల మధ్య ఉన్న గాదంశెట్టి వెంకటేశ్వర్లు పొలంలో నారు వెంకట రామిరెడ్డి.. విగతజీవిగా పడి ఉన్నాడు. పుల్లలచెరువు మండలం కవలకుంట్ల మృతుడి స్వస్థలం. మొదట మద్యం సేవించి పొలంలో పడి మృతి చెంది ఉంటాడని అనుమానించారు. దీంతో త్రిపురాంతకం పోలీసులు.. కూడా ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు. ఐతే పోలీసులకు లభించిన ఆధారాలు, వివిధ కోణాల్లో చేపట్టిన దర్యాప్తుతో అసలు విషయం క్రమంగా బయటపడింది. నారు వెంకట రామిరెడ్డిని ముక్కు నోరు మూసి చంపేశారని గుర్తించారు. కానీ ఎవరు హత్య చేశారో తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వెంకట రామిరెడ్డి.. మద్యం తాగుతూ, జల్సాలు చేసేవాడు. ఊరంతా అప్పులు చేశాడు. ఈ క్రమంలో తన పొలం సాగు చేసుకోవాలని మామ సూచించాడు. ఆ పొలం సాగు చేసుకుంటున్న రామిరెడ్డి తన అప్పులు తీర్చుకునేందుకు బావ దేసిరెడ్డి వీరారెడ్డి సాయం కోరాడు. అప్పులు తీర్చుకునేందుకు రూ. 10 లక్షలు అడిగాడు. ఐతే తమ పొలం సాగు చేసుకోవడమే కాకుండా.. తిరిగి డబ్బులు కూడా అడుగుతావా అని ప్రశ్నించాడు బావ. అంతే కాదు బామ్మర్ది వల్ల తమ ఆస్తులు, డబ్బు నష్టం జరుగుతోందని భావించి… అతన్ని చంపేయాలని నిర్ణయించాడు.

మర్డర్ స్కెచ్‌లో భాగంగా రామిరెడ్డిని పొలం వద్దకు రమ్మన్నాడు బావ వీరారెడ్డి. అందరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం వెంకట రామిరెడ్డి ముక్కు, నోరు మూసేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. మద్యం సేవించి చనిపోయినట్లుగా నమ్మించేందుకు డెడ్ బాడీని బోర్లా పడుకోబెట్టారు. నిందితులంతా అక్కడి నుంచి పరారయ్యారు. మొదట ఈ ఘటన అనుమానాస్పద మృతిగా కనిపించినప్పటికీ పోలీసులు దర్యాప్తును లోతుగా కొనసాగించడంతో హత్య వెనుక ఉన్న అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి కుటుంబ సభ్యులు, నిందితులు, పరిచయస్తులను పోలీసులు విచారించడంతో పాటు ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించారు. సేకరించిన ఆధారాలు, దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా నారు వెంకట రామిరెడ్డి హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఈ హత్యలో మృతుడి బావ దేసిరెడ్డి వీరారెడ్డి, చిలకల అక్కిరెడ్డి, దేసిరెడ్డి నాగ అంజిరెడ్డి, తోకల చిన్న మూర్తయ్యతో పాటు మరో ఇద్దరు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఆగస్టు 8న ప్రధాన నిందితుడు దేసిరెడ్డి వీరారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరుసటి రోజు అక్కిరెడ్డి, దేసిరెడ్డి నాగ అంజిరెడ్డి, తోకల చిన్న మూర్తయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో తాము నేరం చేసినట్లు ఒప్పుకున్నారన పోలీసులు వెల్లడించారు. మొత్తంగా తమ ఆస్తి పోతుందనే ఉద్దేశ్యంతో సొంత బామ్మర్దినే హత్య చేసిన బావ.. ఇప్పుడు హత్యా నేరం కింద ఊచలు లెక్కిస్తున్నాడు.