Maharashtra: నమ్మి వచ్చిన బాలికపై కన్నేసిన ఒక ఫుట్బాల్ కోచ్ మూడేళ్లగా బ్లాక్మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని వసాయ్లో జరిగింది. ఫుట్బాల్లో మంచి కెరీర్ కల్పిస్తానని నమ్మబలికిన 37 ఏళ్ల కోచ్ అభిజిత్ మండల్ 17 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ లైంగిక దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసుకుని బాలికను మానసికంగా, శారీరకంగా వేధించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు అభిజిత్ మండల్ను అరెస్ట్ చేశారు. ఇతను వసాయ్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ ఫుట్బాల్ కోచింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. 2023లో 17 ఏళ్ల బాలిక ఫుట్బాల్ శిక్షణ కోసం అతడి వద్దకు చేరింది. ఈ క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పి, ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తానని నమ్మబలికి ఆమెను మోసం చేశాడు. పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. లైంగిక దాడి సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి, వాటిని బయటపెడుతానని బ్లాక్మెయిల్ చేశాడు.
ఈ దారుణాలు భరించలేక కోచ్కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించినా, వదలకుండా బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో బాలిక చివరకు కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

