Lucknow: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. చౌక్ ప్రాంతంలో ఐదేళ్ల ఆర్నవ్ ను అతని తండ్రి, సవతి తల్లి దారుణంగా హింసించి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం బయటపడడంతో స్థానికులు ఆగ్రహంతో నిందితులపై దాడికి దిగారు. ఈ ఘటనతో అక్కడ పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
Suryakumar Yadav: టీమిండియాలోకి అడుగుపెట్టి నేటితో ఐదేళ్లు.. కెప్టెన్ సూర్యకుమార్ భావోద్వేగ సందేశం!
చౌక్ ప్రాంతంలోని లజపత్ నగర్లో ఆర్నవ్ మృతదేహం అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించింది. అనంతరం చేసిన పోస్ట్మార్టం నివేదికలో భయానక నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడి శరీరంపై మొత్తం 21 గాయాల ముద్రలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ గాయాలు కర్రలతో కొట్టడం వల్ల ఏర్పడినవి, సిగరెట్తో కాల్చిన ముద్రలు, పాత గాయాల గుర్తులు కూడా ఉన్నాయని వెల్లడైంది. అంతేకాదు తీవ్రంగా కొట్టిన తర్వాత గోడకు తల కొట్టడం వల్లే బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా తేలింది.
ఈ ఘటనపై ఆగ్రహంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. పోలీసులు నిందితులను ఇంటి నుంచి బయటకు తీసుకువస్తున్న సమయంలో ప్రజలు వారిపై దాడికి దిగారు. తండ్రి స్థానికంగా న్యాయవాదిగా పని చేస్తున్నట్టు సమాచారం. అతడిపై ప్రజలు తీవ్రంగా కొట్టడానికి ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించి వారిని అక్కడి నుంచి తరలించారు.
ఆర్నవ్ అమ్మమ్మ, మామ ఇచ్చిన సమాచారం ప్రకారం.. బాలుడిని చాలాకాలంగా హింసిస్తున్నారని తెలుస్తోంది. బాలుడిని ఒంటరిగా కలిసేందుకు కూడా అనుమతించేవారు కాదని కుటుంబ సభ్యులు తెలిపారు. వేసవి కాలంలో కూడా అతడికి పూర్తి చేతి చొక్కాలు, మంకీ క్యాప్ వేసి గాయాల గుర్తులు దాచేవారని వారు ఆరోపించారు. ఆర్నవ్ సొంత తల్లి మరణించిన తర్వాత కొంతకాలం బంధువుల వద్ద నివసించాడు. ఆ తర్వాత తండ్రి తన వద్దకు తీసుకెళ్లిన తర్వాతే హింస పెరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
