Site icon NTV Telugu

Jagtial Murder: జగిత్యాలలో దారుణం.. నడిరోడ్డుపై యువకుడి హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?

Jagtial Murder

Jagtial Murder

Jagtial Murder: అది జగిత్యాల పట్టణం. ఓ వైపు శివరాత్రి.. మరోవైపు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక హడావుడి. పట్టణంలో ఎక్కడ చూసినా గందరగోళ వాతావరణం ఉంది. ఈ సందట్లో.. నడిరోడ్డుపైనే అత్యంత దారుణంగా ఓ యువకున్ని చంపేశారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. వివాహేతర సంబంధం కారణంగా జగిత్యాలలో ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బోరే విశ్వనాథ్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. విశ్వనాథ్‌పై ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.

READ ALSO: Ibrahimpatnam Drama: గెలిచినా దక్కని చైర్మన్ పదవి.! హైకోర్టు స్టేతో నిలిచిన ఇబ్రహీంపట్నం ఎన్నికల ఫలితం.!

జగిత్యాల రూరల్‌ మండలం పొరండ్లకు చెందిన బోరే విశ్వనాథ్‌కు జగిత్యాల మండలం అంతర్గాం గ్రామానికి చెందిన వివాహితతో ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైంది. ఆమె భర్త గల్ఫ్‌లో ఉండగా సోషల్‌ మీడియా పరిచయం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో విశ్వనాథ్‌ 4 నెలల క్రితం జగిత్యాలలోని బైపాస్‌ రోడ్డు సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకొని మహిళతో సహజీవనం చేస్తున్నాడు. గల్ఫ్‌ నుంచి తిరిగి వచ్చిన భర్త.. పిల్లల కోసం భార్యను పిలిపించి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడించాడు. తాను తిరిగి భర్త వద్దకు రానని ఆ మహిళ తెగించి చెప్పేసింది.

భార్య చెప్పిన మాటకు భర్త గంగాధర్ షాకయ్యాడు. కానీ తల్లి లేకుండా పిల్లలు ఇబ్బంది పడుతుండడంతో తల్లడిల్లిపోయాడు. అంతే.. తన భార్యను తీసుకు వెళ్లిన విశ్వనాథ్‌పై కోపం పెంచుకున్నాడు. శివరాత్రి సందర్భంగా విశ్వనాథ్‌.. సహజీవనం చేస్తున్న మహిళతో బైక్‌పై సారంగాపూర్‌ మండలంలోని దుబ్బరాజన్న జాతరకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు జగిత్యాలలో వారి కోసం కాపు కాశారు. విశ్వనాథ్‌ జగిత్యాల బైపాస్‌ రోడ్డు వద్దకు చేరుకోగానే ఇద్దరు వ్యక్తులు అతడిపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో విశ్వనాథ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

హత్య అనంతరం నిందితుల్లో.. ఓ వ్యక్తి ఆ మహిళ తన భార్య అని చెప్పి.. విశ్వనాథ్‌తో కలిసి ఉంటోందని అన్నాడు. అందుకే హతమార్చానని చెప్పి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. విశ్వనాథ్‌ తండ్రి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు గంగాధర్‌తో నాలుగు నెలల క్రితమే విడాకులు అయ్యాయని మహిళ చెబుతోంది. అంతే కాదు గంగాధర్ వేరే పెళ్లి చేసుకున్న తర్వాత.. తాను విశ్వనాథ్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. కానీ ఇలా తన భర్తను చంపేశారని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మొత్తానికి వివాహేతర బంధం కారణంగా .. విశ్వనాథ్ ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేస్తోంది.

READ ALSO: Peddi: ‘పెద్ది’ కెప్టెన్‌కు శివన్న సర్ప్రైజ్ గిఫ్ట్..

Exit mobile version