Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!

Food Poisoning

Food Poisoning

Fruit Poisoning: ప్రతి సీజన్‌లో వచ్చే పండ్లు తింటే ఆరోగ్యం చేకూరుతుందని వైద్యులు చెబుతుంటారు. ఇక వేసవి రాగానే.. పుచ్చకాయలు, మామిడి పండ్లు తినేందుకు జనం ఇష్టపడుతుంటారు. మార్కెట్లు కూడా ఆయా రకాల పండ్లతో కళకళలాడుతుంటాయి. చిన్నా, పెద్దా అంతా ఇష్టంగా తినే ఆ పండ్లు సురక్షితమేనా? కొంత మంది వ్యాపారులు తమ లాభాల కోసం రసాయనాలతో పండించడం చూస్తూనే ఉన్నాం. ఫలితంగా మనం అమృతం అనుకుని తింటున్న ఆహారమే మన ప్రాణాలను తీసే విషంగా మారుతోంది.

ఆ అక్కాచెల్లెళ్ల పేర్లు భువనేశ్వరి, సంధ్య. ఈ ఇద్దరూ తమ కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఉంటున్నారు. అందరూ ఇష్టపడే మామిడిపండ్లను ఇష్టంగా తిని.. అస్వస్థతకు గురై ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు చనిపోవడం అందరినీ కలిచి వేస్తోంది. దీంతో కర్ణాటక బీదర్ నుంచి వలస వచ్చిన ఒక పేద కుటుంబంలో ఈ ఘటన కోలుకోలేని విషాదాన్ని నింపింది. సరిగ్గా నెల రోజుల క్రితం మహారాష్ట్ర రాజధాని ముంబైలోనూ బిర్యానీ, ఆ తర్వాత వాటర్ మిలన్ తినడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. గత ఏప్రిల్ 25న ముంబైలోని జేజే మార్గ్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఆ ఏరియాలో ఉండే అబ్దుల్లా డొకాడియా కుటుంబం ఓ పార్టీ నిర్వహించింది. పార్టీకి వచ్చిన అతిథులంతా వెళ్లిపోయాక అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అబ్దుల్లా ఆయన భార్య నస్రీన్, వారి కూతుళ్లు అయేషా, జైనెబ్ బిర్యానీ తిని, అనంతరం వాటర్ మిలన్ తిన్నారు. తర్వాత కొన్ని గంటల్లోపే వారికి తీవ్ర విరేచనాలు, వాంతులు ప్రారంభమయ్యాయి. దీంతో వెంటనే జేజే ఆస్పత్రికి వెళ్లినప్పటికీ, వారు చికిత్స పొందుతూ మరణించారు. అయితే.. ఇలా బిర్యానీ తిని, ఆ తర్వాత వాటర్ మిలన్ తినడంతోనే ఈ మరణాలు సంభవించాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.

×
×
Ad

కేసు తీవ్రత దృష్ట్యా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు పోలీసులు, వైద్య, ఫోరెన్సిక్ నిపుణులు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కూడా దర్యాప్తులో పాల్గొన్నారు. బాధితులు ఆహారం తీసుకున్నప్పటి ఫుడ్ శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. అయితే, వారు తిన్న వాటర్ మిలన్ ఎక్కడ తీసుకొచ్చారు అనే విషయంలోనే స్పష్టత రాలేదు. ఈ వాటర్ మిలన్ ఎక్కడ కొన్నారో కనుక్కోవడం అధికారులకు కష్టంగా మారింది. మొత్తానికి అబ్దుల్లా శరీరంలో మార్ఫైన్ అనే ప్రమాదకర రసాయనాన్ని ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. శరీరంలో అనేక అవయవాలు రంగు మారాయంటే ఏదో విష పదార్థం శరీరం అంతా వ్యాపించి ఉంటుందని నిపుణులు అనుమానించారు. దీంతో వారి మెదడు, గుండె, ఇతర జీర్ణావయవాలు అన్నీ ఆకు పచ్చ రంగులోకి మారిపోయినట్లు గుర్తించారు. మరోవైపు పండ్లు పండించడానికి వాడే ప్రమాదకరమైన రసాయనాలు దీనికి కారణమా? లేక మరేదైనా ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా? అనే కోణంలో పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మొత్తంగా.. ఈ రెండు ఘటనల్లో పండ్లు తిన్న తర్వాతే మృతి చెందడం ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తోంది. పండ్లు కొనాలంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొంది. గతంలో ముంబైలో ఈ ఘటన తర్వాత వాటర్ మిలన్‌ అమ్మకాలు విపరీతంగా పడిపోయినట్లు చెబుతున్నారు. పండ్లలో విష రసాయనాలు వాడుతున్నారనే ప్రచారం.. వాటి విక్రయాలపై ప్రభావం చూపింది. ఐతే పండ్లలో రసాయనాలతో కలుషితం చేస్తున్న వారిపై.. తూతూ మంత్రంగా కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు.