Ex-Girlfriend Murder: మహారాష్ట్ర నాసిక్లో దారుణం జరిగింది. మాజీ ప్రియురాలిని హత్య చేసిన ఒక వ్యక్తి, ఆమెకు కాబోయే భర్తకు ఫోన్ చేసి ‘‘చంపేశాను’’ అని చెప్పాడు. తన ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందనే కోపంలో నిందితుడు ఈ దారుణ చర్యకు ఒడిగట్టాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి నాసిక్లోని ఇందిరా నగర్ ప్రాంతంలోని వనసంపద గార్డెన్ సమీపంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు సహిల్ లవహరే, మృతురాలు వైష్ణవి గతంలో ప్రేమించుకున్నారు. అయితే, ఇటీవల వైష్ణవి మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కోపం పెంచుకున్న సహిత్, వైష్ణవిని కలిశాడు. ఇద్దరి మధ్య అరగంట పాటు వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో వైష్ణవి తనకు కాబోయే భర్తకు ఫోన్ చేసి, ‘‘సహిల్ ఇక్కడ ఉన్నాడు, వెంటనే రండి’’ అని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరి మధ్య గొడవను 22 నిమిషాల పాటు వైష్ణవికి కాబోయే భర్త ఫోన్లో విన్నాడు.
ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో సహిల్, వైష్ణవిపై పలుమార్లు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన వైష్ణవి అక్కడిక్కడే మరణించింది. అనంతరం కాబోయే భర్తకు ఫోన్ చేసి ‘‘వైష్ణవి పని అయిపోయింది’’ అని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు. హత్య జరిగిన స్థలానికి 2 కిలోమీటర్ల దూరంలో నిందితుడు సహిల్ చెట్టుకు ఉరివేసుకుని మరణించాడు. వైష్ణవి అమరావతి జిల్లాకు చెందిన యువతి కాగా, సహిల్ యవత్మాల్ జిల్లా ఉమర్ఖేడ్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు.

