Crime: భార్యను చంపిన కేసులో నిందితుడిగా తేలిన వ్యక్తి గత 4 ఏళ్లుగా పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకుతిరుగుతున్నాడు. అయితే, చిన్న LPG సిలిండర్ బుకింగ్ అతడిని పట్టుకునేలా పోలీసులకు సాయం చేసింది. వినడానికి కొద్దిగా షాకింగ్గా ఉన్నా ఇదే నిజం. భార్య హత్య కేసులో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు శిక్షను ఖరారు చేసిన తర్వాత నాలుగేళ్లుగా పరారీలో ఉన్న భారత సైన్యానికి చెందిన ఒక మాజీ కెప్టెన్ను పట్టుకోవడంలో ఎల్పీజీ సహకరించింది.
మధ్యప్రదేశ్ లోని పాంధుర్నా జిల్లాలో సందీప్ తోమర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపిందని పోలీసులు తెలిపారు. 2013లో తోమన్ అబోహర్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే భార్య శ్వేతా సింగ్ను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మొదట్లో ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించాడు. కానీ పోలీసులు విచారణ తర్వాత ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా తేలింది. 2014లో కోర్టు అతడిని దోషిగా నిర్దారిస్తూ, జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును 2022లో హైకోర్టు సమర్థించింది.
Read Also: Donald Trump: ‘‘ఇక మీ చావు మీరే చావండి’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..
2019లో తోమర్ బెయిల్పై విడుదలై, పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతూ, తన గుర్తింపును దాచాడు. తోమర్ మామ రామ్ నరేష్ నిందితుడిని పట్టుకోవాలని 2024లో హైకోర్టును ఆశ్రయించడంతో పోలీసులు విచారణ వేగవంతమైంది. దీని కోసం ఒక సిట్ ఏర్పాటు చేశారు.
అయితే, తోమర్ ఇటీవల ఎల్పీజీ సిలిండర్ను బుక్ చేయడానికి తన పాన్ కార్డ్ను లింక్ చేసిన ఒక బ్యాంక్ అకౌంట్ను ఫాజిల్కా పోలీసులు గుర్తించడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. దీని ద్వారా నిందితుడు మధ్యప్రదేశ్లో ఉన్నట్టు గుర్తించి, అరెస్ట్ చేశారు. తోమర్ పాంధురాలోని ఒక ఏజెన్సీ నుంచి ఎల్పీజీ సిలిండర్ పొందుతున్నట్లు అతడి బ్యాంక్ అకౌంట్ వివరాల ద్వారా వెల్లడయ్యాయి. గ్యాస్ ఏజెన్సీ ద్వారా అతడి అడ్రస్ను కనిపెట్టి అరెస్ట్ చేశారు.
