హైదరాబాద్లో జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన విచారణ కొనసాగుతుండగానే.. మరో రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి, ఓ క్యాబ్ డ్రైవర్ 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. ఇందులో అతని స్నేహితుడి హస్తం కూడా ఉంది. ఆ ఇద్దరు కలిసి అత్యాచారయత్నానికి పాల్పడగా.. బాలిక ప్రతిఘటించింది. దీంతో, వాళ్లిద్దరు ఆ అమ్మాయిని ఉదయం 5 గంటల సమయంలో సుల్తాన్షాహీ ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు. ఈ కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కి తరలించారు. మరొక కేసులో.. ఈవెంట్ మేనేజర్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
లంగర్హౌస్కు చెందిన మహ్మద్ సూఫియాన్ (21) ఈవెంట్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి చార్మినార్ సమీపంలోని వస్త్ర దుకాణంలో పని చేస్తోన్న బాలికతో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని ఆ బాలికను నమ్మించాడు. అతని మాయమాటలకు పడిపోయిన ఆ బాలిక, అతడ్ని ప్రేమించింది. ఈనెల 30వ తేదీన రాత్రి అతడు బాలికని లంగర్హౌస్లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. మరుసటి రోజు ఆమెను తిరిగి వస్త్ర దుకాణం వద్ద వదిలేసి వెళ్లాడు. గురువారం తీవ్ర కడుపు నొప్పితో ఆ బాలిక బాధపడ్డం చూసిన తల్లి.. ఏం జరిగిందని నిలదీసింది. దీంతో, ఆ బాలిక అసలు విషయం బయటపెట్టడంతో, బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.