Chennai: ఏడేళ్ల నాటి మర్డర్ మిస్టరీ వీడింది.. చంపిందెవరంటే..!

Tamilnadu

Tamilnadu

అనుమానం పెనుభూతమైంది.. తరచూ జరుగుతున్న గొడవలతో భార్యను చంపేశాడు.. డెడ్‌బాడీ మాయం చేశాడు. కానీ డంపింగ్ యార్డ్‌లో బయటపడ్డ శరీర భాగాలు కేసు వెలుగులోకి వచ్చింది. కానీ అప్పటికీ కేసులో మిస్టరీ వీడలేదు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? అనేది తేల్చేందుకు పోలీసులు శ్రమించారు. ఏడేళ్లు కష్టపడి భర్తే హత్య చేసినట్లు తేల్చారు.

2019 జనవరిలో చెన్నైలో నటి సంధ్య హత్య జరిగింది. ఆమె భర్తే అతి కిరాతకంగా హతమార్చి, శరీరాన్ని ముక్కలుగా నరికేశాడు. అంతే కాదు ఆ శరీర భాగాలను చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డంపింగ్ యార్డులలో పారేశాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కేసును మృతురాలి చేతిపై ఉన్న రెండు టాటూల ఆధారంగా ఛేదించారు పోలీసులు.

ఏడేళ్ల కిందట.. చెన్నైలోని పళ్లికరనై డంపింగ్ యార్డ్‌లో ఓ ప్లాస్టిక్ సంచిలో మనుషుల వేళ్లు బయటపడటంతో ఈ కేసు బయటకు వచ్చింది. ఆ సంచిని ఓపెన్ చేసి చూడగా.. తెగిపడిన కాళ్లు, చేయి కనిపించాయి. ఆ తర్వాత నగరంలోని ఓ నది పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో ఇలాంటి ప్లాస్టిక్ సంచులు మరికొన్ని లభ్యమయ్యాయి. వాటిలో ఎముకలు, అంతర్గత అవయవాలు వంటివి ఉన్నాయి. అయితే.. మృతురాలిని గుర్తించేందుకు వీలుగా తల, ఎడమ చేయి మాత్రం కనిపించలేదు. ఈ కేసును పోలీసులు ఛేదించారు కానీ ఆమె తలను మాత్రం కనిపెట్టలేకపోయారు. దీంతో ఆ మృతదేహం ఆమెదేనని కచ్చితంగా నిర్ధారించేందుకు ముఖం లేకుండా పోయింది. కొన్ని మిస్సింగ్ కేసులతో పోల్చిచూసినా సరైన పోలిక లేదు. దీంతో పళ్లికరనై డంపింగ్ యార్డ్‌లో ఏకంగా 11,700 టన్నుల చెత్తను జల్లెడ పట్టారు. అయినప్పటికీ తల ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.

పోలీసులకు దొరికిన కుడి చేతిపై 2 ప్రత్యేకమైన టాటూలు ఉన్నాయి. వాటిని శివపార్వతుల రూపం, డ్రాగన్‌గా గుర్తించారు పోలీసులు. అదే సమయంలో తూత్తుకుడికి చెందిన ఓ మహిళ తన కూతురు కనిపించడం లేదని పోలీసులు ఆశ్రయించారు. కనిపించకుండా పోయిన ఆమె చెన్నైలో నివసించే 37 ఏళ్ల నటి సంధ్యగా తేలింది. దీంతో ఆ మృతదేహాన్ని తల్లి పరిశీలించి.. చేతిపై ఉన్న టాటూలు, గాజుల ఆధారంగా ఆమె తన కూతురేనని గుర్తించారు. ఆ తర్వాత డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆమె చెప్పింది నిజమేనని తేలింది.

ఈ కేసులో సంధ్య భర్త సినీ నిర్మాత బాలకృష్ణన్‌ను పోలీసులు విచారణ చేశారు. ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర బంధం ఉందన్న అనుమానంతో రోజూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని.. అందుకే ఆమెను గొడ్డలితో నరికి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు డెడ్‌బాడీని ముక్కలు చేసి ప్లాస్టిక్ సంచుల్లో వేసి పడేసినట్లు చెప్పాడు. నిందితుడి ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దీన్ని నిర్ధారించారు.