Charlapalli Su*ici*de case: హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మూడు నెలల క్రితం తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కిందపడి మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కొత్త మలుపు చోటుచేసుకుంది. మృతురాలు విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందంటూ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తన భార్య విజయశాంతి రెడ్డి, కుమార్తె చైతన్య రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి మరణాలకు తన బావమరిది వడకళ్ల చిరంజీవి, అత్త పుష్పావతి, చిరంజీవి భార్య లక్ష్మీ కారణమని ఆరోపించారు. ముగ్గురి మరణానికి వీరే కారణమని, ఇప్పుడు తన ఆస్తిని చేజిక్కించుకునేందుకు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా తన ప్రాణాలకు ముప్పు ఉందని, వెంటనే పోలీసు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు.
ఘటన వివరాలు
మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని హరితవనం కాలనీలో సురేందర్ రెడ్డి, విజయశాంతి రెడ్డి దంపతులు నివాసం ఉండేవారు. వీరికి చైతన్య రెడ్డి, విశాల్ రెడ్డి అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేస్తూ మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవారని సమాచారం. విజయశాంతి రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ నెలకు లక్ష రూపాయల వరకు వేతనం పొందుతున్నట్లు తెలిసింది. కుమార్తె చైతన్య రెడ్డి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమారుడు విశాల్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
అనుమానాలకు తావిస్తున్న మరణాలు
జనవరి 30న అర్ధరాత్రి సమయంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్పై విజయశాంతి రెడ్డి, ఆమె ఇద్దరు పిల్లలు మృతిచెందిన ఘటన సంచలనంగా మారింది. ఒకేసారి ముగ్గురు రైలు కిందపడి చనిపోవడం, పిల్లలు పెద్దవారై ఇంటర్ చదువుతున్న వయసులో ఉండటం వల్ల ఈ మరణాలపై అప్పటినుంచే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భర్త చేసిన ఆరోపణలు, ప్రాణహాని ఫిర్యాదుతో ఈ కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఆత్మహత్యగా నమోదైన ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.