Site icon NTV Telugu

Bengaluru: పార్కు నుంచి ఈడ్చుకెళ్లి.. కదిలే కారులో యువతిపై గ్యాంగ్ రేప్

Physical Assult

Physical Assult

Bengaluru: మహిళపై హింస, అత్యాచారాలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను తీసుకువచ్చినా.. మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. దేశంలో ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కామాంధులు బరితెగించి మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూర్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మహిళను బలవంతంగా తీసుకెళ్లి కదిలే కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Read Also: Mosquito Coil : ఆరుగురిని బలి తీసుకున్న మస్కిటో కాయిల్

వివరాల్లోకి వెళ్లితే బెంగళూర్ లో ఓ మహిళ పార్కులో ఉండగా అక్కడ నుంచి ఈడ్చుకెళ్లి, కదులుతున్న కారులో నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని పోలీసులు ఈ రోజు తెలిపారు. ప్రస్తుతం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. గత వారం మార్చి 25న కోరమంగళ లోని నేషనల్ గేమ్స్ విలేజ్ పార్కులో బాధిత మహిళ తన స్నేహితుడిని కలుసుకునేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. వారిద్దరూ అర్థరాత్రి వరకు పార్కులోనే ఉండటంతో నిందితుల్లో ఒకరు బాధితులను ప్రశ్నించాడు. అయితే సదరు మహిళ స్నేహితుడు వెళ్లిపోగానే నిందితుడు తన మరో ముగ్గురు స్నేహితులను పిలిచి పార్కు నుంచి మహిళను తీసుకెళ్లి, తమ కారులోకి బలవంతంగా ఎక్కించారు.

నలుగురు నిందితులు కారులో వేగంగా వెళ్తూ, మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత బాధితురాలిని ఆమె ఇంటి వద్ద దించేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాధితురాలిని బెదిరించారు. చివరకు మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ అత్యాచార విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేయడానికి ముందు బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్నామని బెంగళూర్ సీనియర్ పోలీస్ అధికారి సీకే బాబా తెలిపారు.

Exit mobile version