Acid Attack: మరికొన్ని రోజుల్లో యువతి పెళ్లి, ఇంతలోనే ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ చెందిన 25 ఏళ్ల యువతిపై ఒక యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. బ్యాంక్ నుంచి ఇంటికి వెళ్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను ఆపి ‘‘నువ్వు నాకు దక్కకుంటే, మరెవరికి దక్కకూడదు’’ అంటూ ఆమెపై యాసిడ్ పోశారు. ఉత్తర్ ప్రదేశ్ మౌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
బాధితురాలు, ఆమె కుటుంబం వివాహానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. ఆమె తండి చనిపోవడం, సోదరుడు చిన్నవాడు కావడంతో యువతి సొంతగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటోంది. అయితే, యువతితో రిలేషన్లో ఉన్న నిందితుడు రామ్ జనమ్ సింగ్ పటేల్, ఆమె మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Read Also: Pakistan: సింధు నది పేరుతో, పాకిస్తాన్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం..
గురువారం యువతి బ్యాంక్ నుంచి రూ. 20,000 డ్రా చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మే 27న ఆమె పెళ్లిని ఆపాలనే ఉద్దేశ్యంతోనే నిందితుడు యాసిడ్ దాడి చేసినట్లు తెలుస్తోంది. యువతి ముఖం, భుజం, మెడ, శరీరంపై ఇతర భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. దాడి జరిగిన తర్వాత ఆమెను గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తరలించి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అజంగఢ్ లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు 60 శాతం కాలిన గాయాలు అయినట్లు వైద్యులు చెప్పారు.
నిందితుడు పటేల్తో పాటు మరో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో ఉపయోగించిన బైక్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం, ఆమె వివాహం రద్దు అయింది. యువతి వివాహాన్ని అడ్డుకునేందుకు ఆమె వీపుపై యాసిడ్ పోయాలని అనుకున్నట్లు నిందితుడు పోలీసులతో చెప్పాడు. గత నెలలో యూపీలోని షాజహాన్పూర్ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్య వివాహ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్య, ఇద్దరు కుమార్తెలపై యాసిడ్ దాడి చేశాడు.