Union Budget 2026: నేడు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. బడ్జెట్లో భాగంగా ఆమె పార్లమెంట్లో ప్రసంగిస్తున్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. “దేశ సంస్కరణల రైలు ఆగలేదు.. వేగంగా ముందుకెళ్తూనే ఉంది” అని చెప్పుతూ.. కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకే మొదటి ప్రాధాన్యం ఇస్తోందని మరోసారి స్పష్టం చేశారు. తొమ్మిదోసారి ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026ను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మార్గపటంగా వివరించారు. టెక్నాలజీలో ముందంజ, తయారీ రంగంలో బలం, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం ఇవే ఈ బడ్జెట్ లక్ష్యాలుగా చెప్పారు.
READ MORE: Union Budget 2026: వికసిత భారత్ లక్ష్యంగా బడ్జెట్.. కీలక ప్రకటనలు ఇవే!
ఆగస్టు 15 తర్వాత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ఆర్థిక మంత్రి మొదట గుర్తు చేశారు. జీఎస్టీలో మార్పులు, కొత్త కార్మిక చట్టాలు, నాణ్యత నియంత్రణకు సంబంధించిన కొత్త నిబంధనలు ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థను ఆధునికంగా మార్చే దిశలో తీసుకున్న అడుగులని చెప్పారు. ఈ నిర్ణయాల వల్లే భారత్లో వృద్ధి కొనసాగుతోందని, ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని వివరించారు. ప్రజల మేలు కోసం తీసుకున్న నిర్ణయాలే ఈ ఫలితాలకు కారణమని చెబుతూ.. “ప్రజలకే ప్రాధాన్యం, మాటలకన్నా పనికి విలువ” అనే విధానంతోనే ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెద్ద ఊరట కలిగించే ప్రకటన చేశారు. భవిష్యత్తులో దేశానికి గర్వకారణమైన సంస్థలుగా ఎదిగే సామర్థ్యం ఉన్న ఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు రూ.10 వేల కోట్లతో ప్రత్యేక గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే దేశీయ తయారీని పెంచేందుకు, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు మూడు ప్రత్యేక కెమికల్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇది పరిశ్రమలకు కొత్త అవకాశాలు తెస్తుందని చెప్పారు.
READ MORE: Union Budget 2026: ఎకానమీలో నిలకడ.. మూడు కర్తవ్యాలను ప్రకటించిన ఆర్థిక మంత్రి..
వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ఖనిజాల విషయానికీ బడ్జెట్లో చోటు దక్కింది. 2025లో ప్రారంభించిన రేర్ ఎర్త్ మాగ్నెట్ల పథకం తర్వాత, ఇప్పుడు ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రత్యేక రేర్ ఎర్త్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దీని వల్ల భవిష్యత్తులో హైటెక్ రంగాలు, రక్షణ రంగానికి అవసరమైన ముడి సరుకులు భద్రంగా అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలు ఈ బడ్జెట్లో ప్రధాన స్థంభాలుగా నిలిచాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రకటిస్తూ, పరిశ్రమల ఆధ్వర్యంలో పరిశోధన, ఆధునిక చిప్ తయారీ కేంద్రాలు, నిపుణుల తయారీకి ప్రత్యేక శిక్షణ కేంద్రాలపై దృష్టి పెడతామని చెప్పారు. చిప్ తయారీ, ఎలక్ట్రానిక్స్, సెన్సర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన రంగాల్లో పెట్టుబడులు మరింత పెరుగుతాయని తెలిపారు.