రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఇష్టమైన ఉగాది పర్వదినం వేళ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను ఇస్తాయనుకుంటే.. స్టాక్ మార్కెట్ మాత్రం నేడు ‘బ్లడ్ బాత్’ (భారీ పతనం)తో షాక్ ఇచ్చింది. నిఫ్టి, బ్యాంక్ నిఫ్టి, సెన్సెక్స్ లు భారీగా కుప్పకూలిపోయాయి. ఈ భారీ పతనానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే.. ముఖ్యంగా పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్, ఖతార్లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ (Ras Laffan) ఇండస్ట్రియల్ సిటీపై క్షిపణి దాడులు చేయడం గ్లోబల్ మార్కెట్లను కుదిపేసింది. దీనివల్ల భారత్ లాంటి దేశాల ఇంధన భద్రతపై ఎఫెక్ట్ పడుతోంది. భారత్ తన ఎల్ఎన్జీ (LNG) అవసరాల్లో దాదాపు 47 శాతం ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందనే భయం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది.
ముడిచమురు ధరల మంట
చమురు క్షేత్రాలే లక్ష్యంగా దాడులు జరగడంతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 3 శాతం పెరిగి 111 డాలర్లకు చేరింది. చమురు ధరలు పెరిగితే భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుతుంది. ఇది కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా 92.89 వద్ద కనిష్ఠానికి పడిపోవడం మరో ప్రధాన కారణం. కరెన్సీ బలహీనపడటం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు (FPIs) భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వేగంగా వెనక్కి తీసుకుంటారు.
Also Read:Realme P4 Lite 5G: 7,000mAh బ్యాటరీ, Dimensity 6300తో రియల్మీ 5G ఫోన్ విడుదల..
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలత..
యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవడం.. యుద్ధం కారణంగా ధరలు పెరుగుతాయనే హెచ్చరికలు అమెరికా మార్కెట్లను దెబ్బతీశాయి. దాని ప్రభావంతో జపాన్ (Nikkei), దక్షిణ కొరియా (Kospi) మార్కెట్లు కూడా 2 శాతం పైగా నష్టపోవడం భారత మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.
గత మూడు రోజులుగా మార్కెట్లు లాభాల్లో ఉండటంతో.. ప్రస్తుత అనిశ్చితిని చూసి ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకోవడానికి మొగ్గు చూపారు. దీనివల్ల అమ్మకాల ఒత్తిడి పెరిగి సూచీలు మరింతగా పతనమయ్యాయి. భారతదేశ ఇంధన అవసరాలకు కీలకమైన ఖతార్పై దాడి జరగడం, దానివల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉండటమే నేటి ‘బ్లడ్ బాత్’కు అసలు సిసలు కారణం. కేవలం ఒక్క రోజులోనే రూ. 7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోవడం గమనార్హం.