Site icon NTV Telugu

Stock Market: మార్కెట్‌కు భారీ లాభాల పంట.. కారణమిదేనా?

Stockmarkettrump

Stockmarkettrump

దేశీయ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌ కుదేల్ అయిపోయింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్‌కు జోష్ తెప్పించింది. త్వరలోనే యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ప్రకటించారు. దీంతో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ మంగళవారం భారీ లాభాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 489 పాయింట్లు లాభపడి 78,055 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 157 పాయింట్లు లాభపడి 24,185 దగ్గర కొనసాగుతోంది.

మంగళవారం ఉదయం మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. గత సెషన్‌లో భారీగా నష్టపోయిన తర్వాత ఈ రోజు మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. యుద్ధం త్వరలో ముగిసే అవకాశముందని అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. దీని ప్రభావంతో భారతీయ మార్కెట్లలో కొనుగోళ్లు పెరిగాయి. పెట్టుబడిదారుల్లో సానుకూల వాతావరణం కనిపించింది.

శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేర్లు 5 శాతం వరకు పెరిగి టాప్ గైనర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్ షేర్లు 2 శాతం వరకు పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్ కూడా మంచి జోష్‌లో లాభాల్లో వెళ్తున్నాయి. మొత్తంగా చూస్తే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం రూపాయి బలపడడం వంటి అంశాలు భారతీయ స్టాక్ మార్కెట్లకు ఊపిరి పోశాయి. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులు మార్కెట్ దిశను నిర్ణయించే అవకాశం ఉంది.

Exit mobile version