ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు రూ.6,338 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపింది. మార్చి 20.. శుక్రవారం నాడు బ్యాంక్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. గతంలో బ్యాంకు చూపించిన కొన్ని ఖర్చులను ఆదాయపు పన్ను శాఖ ఆమోదించలేదు. దీనివల్ల అసలు పన్నుతో పాటు వడ్డీ కలిపి ఇంత భారీ మొత్తాన్ని కట్టాలని ఆదేశించింది. ఇలాంటి వివాదాలు గతంలో కూడా ఉన్నాయని, ఇది కొత్తేమీ కాదని SBI తెలిపింది. ఈ నోటీసు వల్ల బ్యాంక్ రోజువారీ పనులకు ఎలాంటి ఆటంకం కలగదని స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా పై అధికారులకు అప్పీల్ చేయాలని, చట్టపరంగా పోరాడాలని బ్యాంకు నిర్ణయించుకుంది.
Also Read:Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..
మరోవైపు.. SBI కి చెందిన మ్యూచువల్ ఫండ్ విభాగం (SBIFML) స్టాక్ మార్కెట్లోకి రావడానికి (IPO) సిద్ధమవుతోంది. ఇది పూర్తిగా ‘ఆఫర్ ఫర్ సేల్’ (OFS) పద్ధతిలో జరుగుతోంది. అంటే కంపెనీ కొత్త షేర్లను సృష్టించడం లేదు. కేవలం ప్రస్తుత యజమానులైన SBI, ఫ్రాన్స్కు చెందిన అముండి (Amundi) సంస్థలు తమ దగ్గర ఉన్న షేర్లను అమ్ముతున్నాయి. SBI సుమారు 12.8 కోట్ల షేర్లను, అముండి సంస్థ 7.5 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో.. శుక్రవారం నాడు స్టాక్ మార్కెట్లో SBI షేరు ధర స్వల్పంగా (0.87 శాతం) తగ్గి రూ.1,058 వద్ద ముగిసింది.