Samsung SmartPhones Sales: ఆన్లైన్ ఫెస్టివ్ సేల్స్లో మొదటి రోజే శామ్సంగ్కి సంబంధించి కోటి రూపాయలకు పైగా విలువైన స్మార్ట్ఫోన్ల సేల్స్ జరిగాయి. అమేజాన్ మరియు ఫ్లిప్కార్ట్ల ద్వారా ఈ అమ్మకాలు జరిగినట్లు శామ్సంగ్ ఇండియా వెల్లడించింది. 12 లక్షలకు పైగా గెలాక్సీ స్మార్ట్ఫోన్లను విక్రయించామని తెలిపింది. పండుగ సీజన్ నేపథ్యంలో శామ్సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్ఫోన్ల రేట్లను 17 శాతం నుంచి 60 శాతం వరకు తగ్గించింది. ఫెస్టివ్ సీజన్ మొదటి రోజే ఈ రేంజ్లో బిజినెస్ జరిగిందంటే ఇక ముందు ముందు ఎన్ని రికార్డులు నమోదవుతాయోనని మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
ఆర్&డీపై ఫోకస్ పెట్టాలి
వ్యాక్సిన్ల తయారీ సంస్థలు పరిశోధన మరియు అభివృద్ధి విభాగంపై మరింత ఫోకస్ పెట్టాలని భారత్ బయోటెక్ ఈడీ అన్నారు. తయారీ రంగంలో మన కంపెనీలు ఈ విషయంలో వెనకబడ్డాయని చెప్పారు. కొన్ని సంస్థలు ఆర్ అండ్ డీ పైన, నూతన ఔషధాల తయారీ పైన పట్టు సాధించాయని, మిగతా కంపెనీలు కూడా ఈ మేరకు ఇన్వెస్ట్మెంట్లు పెంచాలని సూచించారు. ఫార్మా సంస్థలకు కావాల్సిన కొన్ని ముఖ్యమైన ముడి పదార్థాల దిగుమతికి పర్మిషన్ ఇచ్చే విషయంలో నెలల పాటు ఆలస్యం జరుగుతోందని, దీనివల్ల ఔట్పుట్ తగ్గిపోతోందని చెప్పారు.
6 నెలల్లో రూ.630 కోట్లు
టాటా గ్రూప్కి చెందిన ఎయిర్ఏసియా ఇండియా గడచిన ఆరు నెలల్లో 630 కోట్ల రూపాయల షార్ట్ టర్మ్ లోన్లు తీసుకుంది. ఈ సంస్థ ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్తో విలీన ప్రక్రియలో ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఏసియా నగదు కొరత తలెత్తటంతో రుణాల బాట పట్టింది. విస్తారా మరియు ఎయిర్ ఇండియా ఫుల్ సర్వీస్ క్యారియర్లుగా కొనసాగుతుండటం గమనించాల్సిన విషయం.
స్టాక్ మార్కెట్ అప్డేట్
ఇండియన్ స్టాక్ మార్కెట్లను నష్టాలు వీట్లేదు. ఈ వారంలో తొలి రోజైన ఇవాళ కూడా లాస్తోనే ప్రారంభమయ్యాయి. 738 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 57360 వద్ద ట్రేడింగ్ అవుతోంది. 226 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 17082 పాయింట్ల పైన కొనసాగుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.62 వద్ద స్థిరంగా ఉంది. ట్రేడింగ్ ప్రారంభ సమయంలో హర్షా ఇంజనీర్స్, బ్రిటానియా, కోల్ ఇండియా, అనుపమ్ రసాయన్ స్టాక్స్ ఆశాజనకంగా కనిపించాయి.