Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్

  • భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది
  • ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
  • ద్రవ్యోల్బణంపై కొంత ఒత్తిడి ఉందని హెచ్చరిక
Rbi

Rbi

భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ఒక కార్యక్రమంలో సంజయ్ మల్హోత్రా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, అంతర్జాతీయ సంక్షోభాలు కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగా ఉందని తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎంతో స్థిరంగా.. ఆరోగ్యకరంగా ఉందని స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు భారత్‌కు మాత్రమే పరిమితం కావని.. అన్ని దేశాలు ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉందని.. గతంలో ఎదుర్కొన్న ఇలాంటి ఆర్థిక షాక్‌లతో పోల్చినా దేశం మరింత బలంగా నిలిచిందని చెప్పుకొచ్చారు.

ఆర్థిక వృద్ధి విషయంలో భారత్ 6.5 శాతానికి పైగా వృద్ధిరేటును నమోదు చేస్తోందని తెలిపారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇంతటి వృద్ధి సాధిస్తున్న దేశాలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. చమురు ధరల పెరుగుదల ప్రభావం దేశీయ ధరలపై పడే అవకాశముందని.. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

×
×
Ad

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. చమురు, గ్యాస్ కష్టాలతో అన్ని దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పరిస్థితి మాత్రం శాంతించలేదు. హార్ముజ్ జలసంధి కూడా ఇంకా తెరుచుకోలేదు. దీంతో పరిస్థితులు ఇంకా చక్కదిద్దబడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఆర్బీఐ హామీ ఇచ్చింది.