MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..

Dhon Kuku

Dhon Kuku

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఒక అదిరిపోయే వార్త. ప్రముఖ ఆడియో అండ్ వీడియో కంటెంట్ ప్లాట్‌ఫామ్ ‘కుకు ఎఫ్‌ఎమ్’, ‘కుకు టీవీ’ల మాతృసంస్థ అయిన బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘కుకు టెక్నాలజీస్’ పబ్లిక్ ఇష్యూ (IPO)కు వచ్చేందుకు సిద్ధమైంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పెట్టుబడులు పెట్టిన ఈ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ, తాజాగా మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ దగ్గర రహస్యంగా ఐపీఓ పత్రాలను దాఖలు చేసింది.

భారీగా నిధుల సమీకరణే లక్ష్యం..
ఈ ఐపీఓ ద్వారా కుకు టెక్నాలజీస్ సుమారు రూ. 2,500 కోట్ల నుంచి రూ. 3,500 కోట్ల వరకు నిధులను సమీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో కొత్త షేర్ల జారీతో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్ల షేర్ల విక్రయం (OFS) కూడా ఉండనుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ తన మార్కెట్ విలువను ఏకంగా రూ. 15,000 కోట్లుగా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పబ్లిక్ ఇష్యూ కోసం కోటక్, జెఫరీస్, జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్ వంటి ప్రముఖ సంస్థలను బ్యాంకర్లుగా ఎంపిక చేసుకుంది.

×
×
Ad

లాభాల బాటలో దూసుకుపోతున్న కంపెనీ..
ప్రస్తుతం మొబైల్ వినియోగదారులలో ఒకటి లేదా రెండు నిమిషాల నిడివి గల ‘మైక్రో డ్రామాలు’ విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. దీనిని కుకు సంస్థ చక్కగా ఉపయోగించుకుంది. ఆర్థిక సంవత్సరం 2025లోరూ. 240 కోట్ల ఆదాయం ఆర్జించిన ఈ కంపెనీ, ఆర్థిక సంవత్సరం 2026 నాటికి దాదాపు ఏడు రెట్లు వృద్ధి చెంది రూ. 1,400 కోట్ల ఆదాయాన్ని సాధించి సంచలనం సృష్టించింది. గతంలో ప్రకటనల ఖర్చుల వల్ల నష్టాల్లో ఉన్నప్పటికీ, ప్రస్తుతం కంపెనీ బ్రేక్-ఈవెన్ స్థాయికి చేరువైంది.

ధోనితో పాటు ప్రముఖుల మద్దతు..
లాల్ చంద్ బిసు, వికాస్ గోయల్, వినోద్ మీనన్లు 2018లో స్థాపించిన ఈ స్టార్టప్‌లో గ్రాండ్ ఆసియా, ఫండమెంటం, ఇండియా కోషంట్ వంటి దిగ్గజ ఇన్వెస్టర్లతో పాటు ఎంఎస్ ధోని కూడా పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం కుకు యాప్స్‌కు 40 కోట్లకు పైగా డౌన్‌లోడ్‌లు, 1 కోటికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో కంటెంట్ ఖర్చులను తగ్గిస్తూ, అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలోకి కూడా అడుగుపెట్టేందుకు సంస్థ సిద్ధమవుతోంది. కొత్త తరం టెక్నాలజీ కంపెనీల ఐపీఓల వైపు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో వస్తున్న ఈ ఐపీఓ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది.