Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడి వంటగదిపై ధరల భారం పడకుండా చూసేందుకు భారత ప్రభుత్వం కీలక అడుగు వేసే యోచనలో ఉంది. రాబోయే సెప్టెంబర్-నవంబర్ పండగల సీజన్లో తీపి పదార్థాలు, పిండివంటలు, స్నాక్స్ వాడకం పెరిగి ఎడిబుల్ ఆయిల్కు తీవ్ర డిమాండ్ ఏర్పడుతుంది. అయితే, గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో వంటనూనెల ధరలు దాదాపు 20 శాతానికి పైగా పెరిగి ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచేస్తున్నాయి. ఆగస్టులో కూడా రిటైల్ ద్రవ్యోల్బణం వేగవంతమవ్వడానికి ఈ ఆహార ధరల పెరుగుదలే ప్రధాన కారణమైంది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా ధరలను అదుపులోకి తెచ్చి, వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు వంటనూనెలపై దిగుమతి సుంకాలను (Import Duties) తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది.
ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలను దిగుమతి చేసుకునే భారత్, తన దేశీయ అవసరాలలో దాదాపు మూడింట రెండు వంతులను విదేశాల నుంచే పొందుతోంది. ముఖ్యంగా మలేషియా, ఇండోనేషియా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ను భారీగా దిగుమతి చేసుకుంటోంది. అయితే, ఒకవైపు పండగల వేళ వినియోగదారులను ఆదుకుంటూనే, మరోవైపు దేశీయ నూనెగింజల రైతుల ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అందుకే సుంకాల్లో భారీ కోత విధించకుండా, ప్రాథమిక దిగుమతి సుంకాన్ని సుమారు 5 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని పరిశ్రమల రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల దేశీయంగా సోయాబీన్ ధరలు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తగ్గకుండా ఉండి, రైతులకు నష్టం వాటిల్లకుండా ఉంటుంది.
ఇదివరకు మే 2025లో భారత ప్రభుత్వం ముడి వంటనూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 10 శాతానికి సగానికి తగ్గించింది. దీనికి వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్, సోషల్ వెల్ఫేర్ సర్ఛార్జ్ కలిపిన తర్వాత క్రూడ్ పామ్ ఆయిల్, సోయా, సన్ఫ్లవర్ నూనెలపై మొత్తం ప్రభావవంతమైన దిగుమతి సుంకం 16.5 శాతంగా మారింది. అయితే, గతంలో భారత్ సుంకాలు తగ్గించినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో పామ్ ఆయిల్, సోయా ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిన విషయాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
ఇప్పుడు మళ్లీ భారత్ దిగుమతి సుంకాలను తగ్గిస్తే, అది ప్రపంచ వంటనూనెల మార్కెట్పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ నుంచి డిమాండ్ పెరిగితే మలేషియా పామ్ ఆయిల్, అమెరికా సోయా ఆయిల్ ఫ్యూచర్స్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన కూడా ఉంది. పైగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతరాయాలు, ఎల్ నినో వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెల ధరలు ప్రభావితమయ్యాయి. ఈ పరిణామాల మధ్య భారత్ దిగుమతి సుంకం తగ్గించినా, విదేశాల్లో ధరలు పెరిగితే దాని పూర్తి ప్రయోజనం స్థానిక వినియోగదారులకు అందుతుందా లేదా అనేది వేచి చూడాలి. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

