దేశీయ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రకాల సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు పన్ను నిబంధనలను సడలించేందుకు కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను కేబినెట్ ముందుకు తీసుకువచ్చినట్లు సమాచారం. అయితే ఈ సడలింపుల పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ఇటీవల రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే సుమారు 6 శాతం బలహీనపడటం.. జనవరి నుంచి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా నిధులను ఉపసంహరించుకోవడం నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
విదేశీ పెట్టుబడుల ఉపసంహరణపై ఆందోళన
ఈ ఏడాది ప్రారంభం నుంచి విదేశీ పెట్టుబడిదారులు భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి రికార్డు స్థాయిలో రూ.2.25 లక్షల కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల రూపాయి విలువపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం అనంతరం ఆర్బీఐ కూడా కొన్ని కీలక చర్యలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ప్రభుత్వ బాండ్లపై పన్ను మినహాయింపు?
ఇదిలా ఉండగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత ప్రభుత్వ సెక్యూరిటీల్లో (G-Secs) పెట్టే పెట్టుబడులపై ప్రస్తుతం అమల్లో ఉన్న పన్నులను పూర్తిగా మినహాయించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ బాండ్ల ద్వారా పొందే వడ్డీ ఆదాయంపై 20 శాతం విత్హోల్డింగ్ ట్యాక్స్ (TDS), అలాగే 12.5 శాతం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అమల్లో ఉన్నాయి. 2023 జూలై 1 వరకు ఈ విత్హోల్డింగ్ ట్యాక్స్ రేటు కేవలం 5 శాతంగా ఉండేది.
విదేశీ పెట్టుబడిదారుల డిమాండ్లు
కేంద్ర బడ్జెట్కు ముందు విదేశీ పెట్టుబడిదారుల ప్రతినిధులు భారత మార్కెట్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా లిస్టెడ్ సెక్యూరిటీలపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ విధానాన్ని పునఃసమీక్షించాలని.. ఒకేసారి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్తో పాటు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) విధించడం పెట్టుబడిదారులకు భారంగా మారుతోందని అభిప్రాయపడ్డారు.
యుద్ధ ప్రభావం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, రూపాయి బలహీనత, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాల మధ్య విదేశీ పెట్టుబడిదారులకు పన్ను రాయితీలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం కీలకంగా మారింది. ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే భారత మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.