Gold Value: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు పసిడిని ఒక అజేయమైన ‘ఆర్థిక శక్తి’గా మార్చేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ‘బంగారం’ వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో పసిడి మార్కెట్ విలువ ఊహించని స్థాయికి చేరుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మొత్తం విలువ $30 నుంచి $35 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది భారతదేశం, యునైటెడ్ కింగ్డమ్ (UK) దేశాల ఉమ్మడి జీడీపీ (సుమారు $8-$9 ట్రిలియన్లు) కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం.
READ ALSO: Ishan Kishan Girlfriend: ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..! ఇంత ఏజ్ గ్యాపా..?
యుద్ధం తెచ్చిన ‘గోల్డ్’ రష్..
అమెరికా మద్దతుతో ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడులు, ప్రతిగా టెహ్రాన్ చేసిన ప్రతీకార దాడుల వల్ల గ్లోబల్ మార్కెట్లు ఒక్కసారిగా అతలాకుతలమయ్యాయి. ఈ అనిశ్చితి వల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మళ్లారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $5,400 మార్కును దాటి, $5,600 ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరువలో ఉంది. యుద్ధంతో పాటు పోస్ట్-పాండమిక్ ద్రవ్యోల్బణం భయాలు, వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేయడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి.
ఆర్థిక వ్యవస్థలను మించిన ‘బలం’
ఒకవైపు భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను $5 ట్రిలియన్ల మార్కుకు చేర్చాలని దశాబ్ద కాలంగా శ్రమిస్తోంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ సుమారు $3 ట్రిలియన్ల వద్ద ఉంది. కానీ, ఎటువంటి ఫ్యాక్టరీలు, కార్మికులు లేని బంగారం.. కేవలం ‘భయం’ కారణంగా పెరిగిన డిమాండ్తో ఈ రెండు దేశాల ఉమ్మడి జీడీపీని మించిపోయింది. దీన్నే విశ్లేషకులు “ఫైనాన్షియల్ సూపర్ పవర్” అని పిలుస్తున్నారు. గత 13 ఏళ్లుగా ఒకే పరిధిలో కదులుతున్న బంగారం, ఇప్పుడు ఆ గీతను దాటి భారీ దూకుడు ప్రదర్శిస్తోంది. 1972 – 2005లో కనిపించిన తరహాలోనే ఇప్పుడు కూడా దాదాపు ఆరు నుంచి ఎనిమిదేళ్ల పాటు కొనసాగే సుదీర్ఘ ర్యాలీ ప్రారంభమైందని నిపుణులు భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్న వేళ, బంగారం మాత్రం అత్యుత్తమ రాబడులను అందిస్తోంది. బంగారం ఇంతలా పెరగడానికి యుద్ధమే ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి, శాంతి నెలకొంటే ధరల్లో భారీ మార్పు వచ్చే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే, కేంద్ర బ్యాంకుల ఆసక్తి, కరెన్సీలపై నమ్మకం తగ్గడం వంటి కారణాల వల్ల పసిడి తన ఆధిపత్యాన్ని ఇలాగే కొనసాగిస్తుందని మెజారిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Chhattisgarh Drug Bust: సినిమా ఫక్కీలో నల్లమందు సాగు.. పొలానికి సెక్యూరిటీగా బౌన్సర్లు!