‘Fine’ Apple: ‘యాపిల్’ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. ఛార్జర్ లేకుండా ఐఫోన్ అమ్మొద్దని బ్రెజిల్ ప్రభుత్వం యాపిల్ సంస్థను ఆదేశించింది. ఈ మేరకు అఫిషియల్ గెజిట్లో పేర్కొంది. ఫోన్కి ఛార్జర్ అవసరమని తెలిసినప్పటికీ ఆ సంస్థ ఉద్దేశపూర్వకంగానే వినియోగదారులపై వివక్ష చూపినట్లు తప్పుపట్టింది. ఈ తప్పు చేసినందుకు 2.38 మిలియన్ డాలర్ల జరిమానా కూడా విధించింది. ఇక మీదట ఛార్జర్ లేకుండా ఏ ఐఫోన్ మోడల్నీ విక్రయించొద్దని తేల్చిచెప్పింది. ఐఫోన్ 12తోపాటు కొత్త మోడళ్ల సేల్స్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇకపై రూపాయల్లోనే..
అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులను ఇకపై మన కరెన్సీ రూపాయల్లోనే చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రవేశపెట్టిన సరికొత్త వ్యవస్థను తాము కూడా అమల్లోకి తెచ్చేందుకు టాప్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాయని సమాచారం. ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల నుంచి ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యాతో ఇండియా వాణిజ్యాన్ని పెంచాలనే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవాళ ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసింది.
షాపింగ్ పేజ్.. క్లోజ్!
సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ఇన్స్టాగ్రామ్.. షాపింగ్ పేజీని తొలగించనున్నట్లు తెలుస్తోంది. డైరెక్ట్ యాడ్ రెవెన్యూని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సంస్థ తన స్టాఫ్కి ఇంటర్నల్ మెమోని జారీచేసిందని సమాచారం. ఈ పరిణామంతో కంపెనీ ప్రాధాన్యతలు మారాయని ఇన్స్టాగ్రామ్ వెల్లడించింది. యూజర్లు మరింత ఈజీగా షాపింగ్ చేసేలా మార్పులు చేర్పులు చేస్తున్నామని చెబుతోంది. ఫీడ్, స్టోరీస్, రీల్స్ మరియు లైవ్ షాపింగ్, డ్రాప్స్ వంటి ఇన్నోవేషన్స్ ద్వారా సబ్స్క్రయిబర్లు వివిధ ఉత్పత్తులను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.