NTV Telugu Site icon

Business Flash: 1000 మంది ఉద్యోగులను తీసేయనున్న ఓలా

Business Flash

Business Flash

Business Flash: ఇండియాలోని మల్టీ నేషనల్‌ రైడ్ షేరింగ్‌ కంపెనీ అయిన ఓలా.. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తోంది. సంస్థ పునర్నిర్మాణంపై ఫోకస్‌ పెట్టిన యాజమాన్యం ఈసారి ఏకంగా 1000 మందిపై వేటు వేయనుందని చెబుతున్నారు. విద్యుత్‌ వాహనాల వ్యాపారంపై ప్రత్యేకంగా దృష్టిసారించిన మేనేజ్‌మెంట్‌ ఈ దిశగా నియామకాల్లో దూకుడు పెంచటం గమనార్హం. మొబిలిటీ, హైపర్‌ లోకల్‌, ఫిన్‌టెక్‌తోపాటు పాత కార్ల వ్యాపార విభాగాల్లో భారీగా మార్పులు, చేర్పులు చేస్తోంది. ఈ కార్యాచరణ మరికొద్ది వారాల పాటు కొనసాగనుందని పేర్కొంటున్నారు.

సెల్ఫ్‌ మేడ్‌ సంపన్నురాలిగా ఫల్గుణి నాయర్‌

‘నైకా’ ఫౌండర్‌ ఫల్గుణి నాయర్‌.. బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షాని దాటేశారు. తద్వారా సెల్ఫ్‌ మేడ్‌ సంపన్నురాలిగా అగ్రస్థానం ఆక్రమించారు. ఫల్గుణి నాయర్‌ నికర సంపద రూ.57,520 కోట్లుగా నమోదైంది. కొటక్‌ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ హురున్‌ ఈ మేరకు రిపోర్ట్‌ చేసింది. అత్యంత ధనిక భారతీయ మహిళలతో జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది ఈ లిస్టులోకి కొత్తగా 25 మంది చేరినట్లు వెల్లడించింది. 2021లో కిరణ్‌ మజుందార్‌ షా నంబర్‌-1 ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఈసారి ఫల్గుణి నాయర్‌ ఏకంగా 9 స్థానాలు ఎగబాకి తొలి స్థానానికి చేరుకున్నారు.

read also: What is the value of marriage? : ఇతరుల మోజులో పడి విలువలు కోల్పోతున్నారా? వివాహ బంధానికి విలువేది?

‘టాటా’కి మరిన్ని నష్టాలు

టాటా మోటార్స్‌ నష్టాలు 5 రెట్లు పెరిగాయి. దీంతో మొత్తం నికర నష్టాలు రూ.4950 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. గతేడాది నష్టం రూ.992 కోట్లు మాత్రమే కావటం గమనార్హం. తాజా నష్టాలకు చిప్‌ల కొరత, ఫారెక్స్‌ నిల్వల్లో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, చైనాలో లాక్‌డౌన్లే కారణమని తెలిపింది. భారత్‌లో ప్రయాణికుల వాహనాల విక్రయాలు బాగున్నా అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌ వెహికిల్‌ సేల్స్‌లో భారీ పతనం నమోదైనట్లు పేర్కొంది.

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌

స్టాక్‌ మార్కెట్‌లో సానుకూల పరిస్థితులు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజూ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 500 పాయింట్లు పెరిగి 57,376 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. నిఫ్టీ 17064 పాయింట్లపైనే కొనసాగుతోంది. అశోక్‌ లేల్యాండ్‌ షేర్లు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. త్రైమాసిక ఫలితాల వెల్లడి ముంగిట 6% లాభపడ్డాయి. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కి 9.5 శాతం ప్రాఫిట్‌ వచ్చింది. తద్వారా 52 వారాల గరిష్టానికి స్టాక్‌ వ్యాల్యూ చేరుకుంది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, సన్‌ ఫార్మా షేర్లకు మాత్రమే నష్టాలు వచ్చాయి.