AI: ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ ఉద్యోగుల్ని తీసేసి, ఏఐపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఏకంగా భారత బడ్జెట్కు దాదాపుగా సమానమైన పెట్టుబడుల్ని కేవలం నాలుగు కంపెనీలే పెడుతున్నాయంటే ఏ రేంజ్లో ఏఐ బూమ్ ఉందో తెలుస్తోంది. ఏఐ, దాని అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ ఏకంగా 650 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని పెడుతున్నాయి. ఇటీవల, మన కేంద్ర బడ్జెట్ సుమారుగా 670 బిలియన్ డాలర్లు.
AIపై భారీ పెట్టుబడులు:
అయితే, టెక్ కంపెనీలు చెబుతున్న ఈ లెక్క కేవలం అంచనా మాత్రమే. దీని కన్నా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. దీనిని బట్టి చూస్తే భారత్ బడ్జెట్ కేటాయింపుల కన్నా ఏఐపై దిగ్గజ కంపెనీలు పెడుతున్న పెట్టుబడులు అధికం. అమెజాన్ $200 బిలియన్, గూగుల్ $175–185 బిలియన్లు, మెటా $115–135 బిలియన్లు, మైక్రోసాఫ్ట్ $115–135 బిలియన్లు ఖర్చు చేస్తామని ప్రకటించాయి. ఈ మొత్తం ఖర్చు ప్రధానంగా డేటా సెంటర్లు, సూపర్కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, AI చిప్లు, సర్వర్లు, క్లౌడ్ టెక్నాలజీల కోసం వినియోగించుతామని చెబుతున్నాయి.
ఏఐ రంగంలో గెలిచిన వారికే టెక్ రంగంలో ఆధిపత్యం. దీంతోనే అనేక కంపెనీలు ఏఐపై దృష్టిపెట్టాయి, భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ మాట్లాడుతూ.. ప్రతీ కస్టమర్ అనుభవం ఏఐతో ముడిపడి ఉందని, అందు కోసమే తాము అగ్రెసివ్గా పెట్టుబడులు పెడుతున్నామని చెప్పారు.
ఉద్యోగాలను తినేస్తున్న AI:
ఇదిలా ఉంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ఉద్యోగాలను తినేస్తోంది. ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన ఆంథ్రోపిక్ సీఈఓ చేసిన వ్యాఖ్యలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో గుబులు పెంచుతున్నాయి. వచ్చే కొన్ని రోజుల్లో టెక్కీలను రీప్లేస్ చేసే ఏఐ మోడల్స్ వస్తాయని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటి వరకు అమెజాన్ 30,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. మైక్రోసాఫ్ట్ 9000 మందిని, మెటా తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో 10 శాతం సిబ్బందిని తగ్గించింది. ఏఐ వల్ల రాబోయే కాలంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసేసే అవకాశం ఉంది.