Maha Shivaratri 2026: ఆలయాలన్నీ హరహర మహాదేవ.. శంభో శంకర నామస్మరణతో మారుమోగే పవిత్ర కాలం రానే వచ్చింది. మాఘ బహుళ చతుర్దశి పర్వదినాన శివయ్యకు అత్యంత ప్రీతికరమైన ‘మహాశివరాత్రి’ని దేశవ్యాప్తంగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ పవిత్ర రోజున ఉపవాస జాగరణలు చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున ఉపవాస దీక్ష ఉండే వారు పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: India vs Pakistan Match: టీమిండియా ఓటమికి ‘‘ప్లాన్’’ చేసిన షాహిద్ అఫ్రిది..
ఉపవాస దీక్షలో పాటించాల్సిన నియమాలు..
ఈ సందర్భంగా పలువురు ఆధ్యాత్మిక వేత్తలు మాట్లాడుతూ.. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండేవారు సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలని సూచించారు. శివాలయ దర్శనం అనంతరం రోజంతా భగవన్నామ స్మరణలో గడపాలని చెప్పారు. ఉపవాసం ఉండే వారు పచ్చిపాలు, పండ్లు (ముఖ్యంగా కమలా పళ్ళు, పుచ్చకాయ, దానిమ్మ) తీసుకోవచ్చన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉడికించిన ఆహారం, వండిన పదార్థాలు అస్సలు తీసుకోకూడదన్నారు. ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టే ప్రసాదాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చని వెల్లడించారు. దేవుడికి నివేదించిన ప్రసాదాన్ని కాదనడం అపచారమని చెబుతున్నారు.
ఆధ్యాత్మిక వేత్తలు మాట్లాడుతూ.. ఉపవాసం అందరూ చేయాలనే కఠిన నియమం ఏమీ లేదు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలు, అనారోగ్య సమస్యలు (బీపీ, షుగర్ వంటివి) ఉన్నవారు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. శరీరాన్ని కష్టపెట్టి చేసే ఉపవాసం కంటే, మనసును శివుడిపై ఉంచి చేసే ఆరాధన మిన్న అని గుర్తు చేశారు. జాగరణ అంటే రాత్రంతా మేల్కొని ఉండటం. అయితే, దీనిని టీవీ సీరియల్స్ లేదా సినిమాలతో గడపకూడదని సూచించారు. శివ స్తోత్రాల కంటే శివ భక్తుల కథలు వినడం వల్ల పరమేశ్వరుడు అత్యంత సంతోషిస్తాడని చెప్పారు. జాగరణ సమయంలో అనవసరమైన లౌకిక విషయాలు, రాజకీయాలు చర్చించకుండా శివనామ స్మరణలో గడపడం శ్రేయస్కరం అని సూచించారు.
ఆలయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..
* కొబ్బరికాయలు కొట్టేటప్పుడు పెంకులు, పీచు రోడ్డుపై పడకుండా చూడాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే పూజా ఫలం లభించదు.
* పాల ప్యాకెట్లను పంటితో కొరికి అభిషేకం చేయడం మహా అపచారం. గ్లాసు లేదా చెంబులోకి పాలు పోసి మాత్రమే అభిషేకం చేయాలి.
* శివరాత్రి నాడు గోజాతికి (ఆవు లేదా ఎద్దు) మేత వేయడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది. నందీశ్వరుని అనుగ్రహం పొందితే, ఆ పరమశివుని కరుణ త్వరగా లభిస్తుందని నమ్మకం.
* లింగోద్భవ కాలమైన అర్ధరాత్రి వేళ ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించి, ఉపవాస జాగరణలతో ఆ పరమశివుని ఆశీస్సులు పొందుదాం.
ఓం నమః శివాయ..