SUV Safety: రోడ్డుపై పెద్దగా, బలంగా కనిపించే ఎస్యూవీ (SUV) కార్లు ఈ రోజుల్లో అందరి ఫేవరెట్గా మారిపోయాయి. అయితే, ఈ వాహనాల పరిమాణం (సైజ్) రోజురోజుకూ పెరిగిపోవడం పెద్ద ప్రమాదంగా మారుతోంది. పాదచారులకు పెద్ద ముప్పగా పరిణమిస్తోంది. అమెరికాలో గత రెండున్నర దశాబ్దాలుగా వాహనాల బోనెట్ (హుడ్) ఎత్తు పెరగడం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, ఒకవేళ ఆ ఎత్తు తక్కువగా ఉండి ఉంటే వారిని కాపాడే అవకాశం ఉండేదని ఓ కొత్త పరిశోధనలో తేలింది. కార్ల కంపెనీలు, నియంత్రణ సంస్థలు వాహనం లోపల కూర్చునే వారి భద్రతపై నిరంతరం పనిచేస్తున్నాయి కానీ, కార్ల ముందు నడిచే పాదచారుల రక్షణకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆందోళనకరమైన విషయం ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ (NY Times) నిర్వహించిన ఒక అధ్యయనంలో.. వాహనాల బోనెట్ ఎత్తు పెరగడం అమెరికన్ రోడ్లపై ఎంత ప్రమాదకరంగా మారుతోందో స్పష్టమైంది. గత కొన్ని సంవత్సరాలుగా మనదేశంలోనూ పెద్ద సైజ్, ఎస్యూవీలు, ఎత్తైన బోనెట్ ఉన్న కార్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ పరిశోధన భారత్కు కూడా ఎంతో కీలకమైనదిగా మారనుంది.
పరిశోధన ఏం చెబుతోంది?
ఆధునిక ఎస్యూవీలు, పికప్ ట్రక్కుల బోనెట్ గతంతో పోలిస్తే చాలా ఎత్తుగా మారుతోందని అధ్యయనం పేర్కొంది. ఇటువంటి వాహనం ఏదైనా పాదచారుడిని ఢీకొట్టినప్పుడు, ఆ ప్రభావం నేరుగా మనిషి శరీర పైభాగంపై పడుతుంది. దీనివల్ల ప్రమాదానికి గురైన వ్యక్తి కారు బోనెట్పై పడకుండా, నేరుగా రోడ్డుపై పడతాడు. గట్టిగా ఉండే రోడ్డు ఉపరితలంపై పడటం వల్ల తీవ్రమైన గాయాలు కావడమే కాకుండా మరణించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటోంది. కారు తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నా.. ఈ ప్రమాదాలు తీవ్రంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వాహనం బలంగా ఢీకొట్టడం వల్ల పాదచారుడు కారు ముందుకు పడిపోతాడని, కొన్నిసార్లు అతని తల నేరుగా వాహన చక్రాల (టైర్ల) కిందకు వచ్చేస్తుందని, అందుకే చిన్న చిన్న ప్రమాదాలు సైతం ప్రాణాంతకంగా మారుతున్నాయని వివరించారు.
8 ఏళ్లలో 3,000 కంటే ఎక్కువ మరణాలు
ప్రమాద రికార్డులు, వాహనాల రిజిస్ట్రేషన్ డేటా, ఇతర సాంకేతిక సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత ఈ నివేదికను రూపొందించారు. ఈ అధ్యయనం ప్రకారం.. 2016 నుంచ 2024 మధ్య కాలంలో ఎత్తైన బోనెట్ వాహనాల సంఖ్య పెరగడం వల్లే దాదాపు 3000 కంటే ఎక్కువ అదనపు మరణాలు సంభవించాయట. పార్కింగ్ స్థలాలు, ప్రైవేట్ రోడ్లు, డ్రైవ్వేలలో జరిగే అనేక ప్రమాదాలు ప్రభుత్వ డేటాబేస్లో నమోదు కావు కాబట్టి వాస్తవ సంఖ్య దీనికంటే చాలా ఎక్కువగా ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ గణాంకాలు గత కొన్ని ఏళ్లలో జరిగిన మొత్తం పాదచారుల మరణాలలో దాదాపు 10 శాతానికి సమానం. ఒకవేళ వాహనాల సైజ్ 2000వ సంవత్సరం ప్రారంభంలో ఉన్నట్లుగానే ఉండి ఉంటే, ప్రతి సంవత్సరం దాదాపు 200 నుంచి 400 మంది పాదచారుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉండేదని నివేదిక స్పష్టం చేసింది.
ఒక ఇంచ్ ఎత్తు పెరిగినా ప్రమాదమే!
ఈ పరిశోధనలో మరో ఆసక్తికరమైన నిజం వెలుగులోకి వచ్చింది. వాహనం బోనెట్ ఎత్తులో ప్రతి ఒక్క ఇంచ్ (Inch) పెరుగుదలకు, పాదచారుడు మరణించే అవకాశం దాదాపు 2.8 శాతం పెరుగుతుందని తేలింది. వివిధ రకాల పరిస్థితులను విశ్లేషించిన తర్వాత.. ఒకవేళ కార్ల బోనెట్ ఎత్తు కొన్ని ఇంచులు తక్కువగా ఉండి ఉంటే, 2016 నుంచి 2024 మధ్య కాలంలో 2600 నుంచి 3000 కంటే ఎక్కువ మంది ప్రాణాలను రక్షించవచ్చని అంచనా వేశారు. సమస్య కేవలం ఎత్తైన బోనెట్తోనే ముగిసిపోలేదు. ప్రస్తుత కార్లలో భద్రతను మెరుగుపరచడానికి ‘లావుపాటి ఏ-పిల్లర్స్’ (A-Pillars) ఏర్పాటు చేస్తున్నారు. కారు పల్టీలు కొట్టినప్పుడు ఇవి లోపల ఉన్న ప్రయాణికులను కాపాడతాయి కానీ, వీటివల్ల డ్రైవర్ విజిబిలిటీ తగ్గిపోయి ‘బ్లైండ్ స్పాట్స్’ (Blind Spots) పెరుగుతున్నాయి. చాలా మంది భారతీయ కార్ల యజమానులు సైతం ఈ వెడల్పాటి ఏ-పిల్లర్ల కారణంగా బ్లైండ్ స్పాట్ పెరిగిపోతోందని, సైడ్ నుంచి వచ్చే ఇతర వాహనాలు లేదా వస్తువులు తమకు సడన్గా కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు.

