Maruti Suzuki Sales: ప్రస్తుతం పండుగల సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే మార్కెట్ సందడిగా ఉంది. సెప్టెంబర్ 22న అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ మరింత ఉత్సాహాన్ని జోడించింది. వాహనాల ధరలు గణనీయంగా తగ్గాయి. దీని ప్రత్యక్ష ప్రభావం కార్ల కొనుగోళ్లపై కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. మారుతి సుజుకి కార్ల అమ్మకాలలో ముందంజలో ఉంది. నవరాత్రి ప్రారంభమైనప్పటి నుంచి 80,000 కంటే ఎక్కువ మారుతి కార్లు అమ్ముడయ్యాయి. ఇంకా, ప్రతిరోజూ దాదాపు 80,000 మంది షోరూంలను విజిట్ చేస్తున్నారు. షోరూమ్లు చాలా రద్దీగా ఉండటంతో డీలర్లు రాత్రి 11:00-12:00 వరకు కార్లను డెలివరీ చేస్తున్నారు. జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన మొదటి రోజే.. మారుతి సుజుకి 25,000 కార్లను డెలివరీ చేసి 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. తాజాగా కార్ల కొనుగోళ్లు మరింత పెరుగుతున్నాయి.
కొనుగోళ్లు పెంచేందుకు కంపెనీ కొత్త స్ట్రాటజీని అమలు చేస్తోంది. తమ కార్లపై భారాన్ని తగ్గించేందుకు మారుతి సుజుకి ఓ EMI పథకాన్ని ప్రారంభించింది. EMI కేవలం రూ. 1,999 నుంచి ప్రారంభం కానుంది. అంటే బైక్ లేదా స్కూటర్ ఈఎంఐతో సమానంగా అందించేందుకు యత్నిస్తోంది. మనదేశంలో లక్షలాది మంది ద్విచక్ర వాహన వినియోగదారులు ఉన్నారని కంపెనీకి తెలుసు. వారికి కొంచెం ప్రోత్సాహం అందించి కార్లవైపు మొగ్గు చూపేలా కంపెనీ ఈ మాయాజాల ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. దీని కింద వినియోగదారులు నెలకు కేవలం రూ. 1,999 చెల్లించి కారు కొనుగోలు చేయవచ్చు. ఇటీవలి రెపో రేటు తగ్గించిన విషయం తెలిసిందే. ఇది EMIలను మరింత సులభతరం చేయడంలో సహాయపడిందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు.. మారుతి కొన్ని ఎంట్రీ-లెవల్ మోడళ్ల ధరలను 24% వరకు తగ్గించింది. ఇది డిసెంబర్ 31, 2025 వరకు ఈ తగ్గింపు అమలులో ఉంటుంది.
నోట్: వివిధ వెబ్ సైట్ల ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఈ వార్తను ప్రచురించాము. మీ ప్రాంతంలో రేట్లు, తదితర అంశాలు మారే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు స్థానిక షోరూం లేదా డీలర్ ను సంప్రదించి తగ్గింపు, ఈఎంఐ తదితర వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయండి.