ప్రముఖ జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) తన ప్రసిద్ధ స్పోర్ట్స్ బైక్ నింజా 250 (Ninja 250)ను అప్డేటెడ్ వెర్షన్లో విడుదల చేసింది. కొత్త కలర్ ఆప్షన్స్, శక్తివంతమైన ఇంజన్, ఆధునిక ఫీచర్లతో ఈ బైక్ను జపాన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే, ఈ మోడల్ను భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు.
కొత్త నింజా 250లో శక్తివంతమైన ఇంజన్
కవాసకి నింజా 250లో 249cc సింగిల్-సిలిండర్ ఇంజన్ ను అందించింది. ఈ ఇంజన్ 39 PS పవర్, 23.5 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్కు 6-స్పీడ్ గేర్బాక్స్ కు జత చేశారు. దీంతో నగర రోడ్లతో పాటు హైవేలపై కూడా మెరుగైన పనితీరు అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఆకట్టుకునే ఫీచర్లు
కొత్త నింజా 250లో రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే పలు ఫీచర్లను అందించారు. ఇందులో అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ స్టాండర్డ్గా లభిస్తుంది. అలాగే LED హెడ్లైట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 17-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ బైక్ను లైమ్ గ్రీన్, డార్క్ మెటాలిక్ అనే రెండు కొత్త ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
ధర ఎంత?
జపాన్లో కవాసకి నింజా 250 ధర 7.26 లక్షల జపనీస్ యెన్ గా నిర్ణయించారు. భారత కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ.4.37 లక్షలు అవుతుంది. అయితే, దిగుమతి సుంకాలు, పన్నులు వంటి కారణాల వల్ల ఇతర దేశాల్లో ధర మారే అవకాశం ఉంది.
భారత్లో లాంచ్ అవుతుందా?
ప్రస్తుతం భారత మార్కెట్లో కవాసకి నింజా 300 మాత్రమే అధికారికంగా విక్రయిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 250cc ఇంజన్తో నింజా 250ను భారతదేశంలో విడుదల చేసే ప్రణాళిక ప్రస్తుతం కంపెనీకి లేదని తెలుస్తోంది. దీంతో భారతీయ కస్టమర్లు ప్రస్తుతం నింజా 300నే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

