RK Roja: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆమె మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్న నాయకులు ప్రజలకు మంచి చేయాలని, అది చేయలేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని హితవుపలికారు.. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని ఇప్పటికే పలుమార్లు చెప్పినా కూడా కొంతమంది నాయకులు ఇంకా అదే విధంగా మాట్లాడుతున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు… సీబీఐ ద్వారా వచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు కలిసిందనే ఆరోపణలు అసత్యమని పేర్కొన్నారు.
Read Also: Assam: అస్సాంలో విషాదం.. సుఖోయ్ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ఇక, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోం మంత్రి స్థాయిలో ఉన్న నాయకులు కూడా దిగజారి మాట్లాడుతున్నారని చంద్రబాబు, పవన్ కల్యాణ్, అనితపై ఫైర్ అయిన రోజా.. ప్రజలు ఈ విషయాలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. శాసన మండలిలో చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తి కులం, మతం గురించి మాట్లాడటం చాలా దిగజారిపోయిన చర్య అని ఆమె విమర్శించారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కులం, మతం చూడకుండా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే దానిపైనే దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రి అచ్చెన్నాయుడుపై కూడా రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలని.. కానీ, అచ్చెన్నాయుడు ఎప్పుడైనా సక్రమంగా మాట్లాడారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని ఆలయాల ప్రతిష్టను దెబ్బతీయే విధంగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని రోజా ఆరోపించారు. ముఖ్యంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి టెంపుల్, శ్రీశైలం ఆలయం, అన్నవరం సత్యనారాయణస్వామి టెంపుల్.. వంటి ప్రసిద్ధ ఆలయాల ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడటం సరైంది కాదన్నారు. లడ్డూ వ్యవహారంపై తప్పు చేయలేదని భావిస్తే చర్చకు రావాలని రోజా సవాల్ విసిరారు. ఈ అంశాన్ని దారి మళ్లించడానికి కుల ప్రస్తావన తీసుకురావడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రోజా వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను, దేవాలయాల ప్రసాదాన్ని ఉపయోగించి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని ఆమె సూచించారు.