విశాఖపట్నం తీరంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వారి ఆచూకీ కోసం భారత కోస్ట్ గార్డ్ విస్తృత స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళనతో ఫిషింగ్ హార్బర్ వద్ద వేచి చూస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ నెల 1వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు సుమారు 50 మైళ్ల దూరంలో ఉన్న పూడిమడక పరిసర ప్రాంతాల్లో వేట కొనసాగించారు. అయితే, నిన్న సాయంత్రం 4.30 గంటల తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదు.
గంగవరం పోర్టు సమీపం నుంచే చివరి సమాచారం
కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన సమయంలో తాము గంగవరం పోర్టు సమీపంలో ఉన్నామని మత్స్యకారులు తెలిపినట్లు సమాచారం. ఆ తర్వాత వారి ఫోన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్
మత్స్యకారులతో సంబంధాలు తెగిపోవడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. భారత కోస్ట్ గార్డ్ సముద్రంలో ప్రత్యేక గాలింపు చర్యలు ప్రారంభించింది. గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ కోసం సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నారు.
ఏడాది క్రితం కొనుగోలు చేసిన బోటు
గల్లంతైన బోటును యజమాని కారి చిన్నయ్య ఏడాది క్రితమే కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ బోటుకు ఆయనే డ్రైవర్గా వ్యవహరిస్తుండగా, తన అల్లుడు, అన్నయ్య కుమారులతో కలిసి చేపల వేటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన పలువురు మత్స్యకారులు ఒకేసారి గల్లంతవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
గల్లంతైన మత్స్యకారులు వీరే
అప్పలరాజు
బండియ్య
గరగయ్య
సీతుడు
చిన్న అమ్మోరు
కారి చిన్న
కారి చిన్నయ్య
ఫిషింగ్ హార్బర్లో విషాద వాతావరణం
మత్స్యకారుల ఆచూకీ కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద రోదనలు మిన్నంటిస్తున్నాయి. తమ కుటుంబ సభ్యులు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలను కొనసాగిస్తోంది. మత్స్యకారుల ఆచూకీపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

