Saikrishna Mother Vijayalakshmi: విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో మెజిస్ట్రియల్ విచారణ ముగిసిన అనంతరం అతని తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారని ఆమె తెలిపారు. తన కుమారుడి మరణానికి కారణమైన వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన విజయలక్ష్మి, తన కుమారుడు పవన్ కల్యాణ్కు అభిమానిగా ఉండేవాడని చెప్పారు. నిజాలు తెలుసుకోకుండా అతడిని క్రిమినల్గా చిత్రీకరించడం బాధాకరమని అన్నారు. తాము కాపు సామాజిక వర్గానికి చెందినవారమని, పవన్ కల్యాణ్ను నమ్మి ఓట్లు వేసి గెలిపించామని పేర్కొన్నారు.
ఈ కేసులో ఇంకా పలువురు వ్యక్తుల ప్రమేయం ఉందని ఆరోపించిన విజయలక్ష్మి, తన కుమారుడిని ఇంటి నుంచి తీసుకెళ్లిన వారిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని విమర్శించారు. వారందరినీ చట్టం ముందు నిలబెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తన కుమారుడి బూడిదను తనకు అప్పగించాలని కోరుతూ, బూడిద ఇవ్వకపోతే ఆత్మాహుతికి పాల్పడతానని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న బూడిద నిజంగా తన కుమారుడిదేనని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరిపి పూర్తి నిజాలు బయటపెట్టాలని, బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి..

