NTV Telugu Site icon

Vizag Steel Plant: లోక్‌సభలో ఉక్కుశాఖ మంత్రి కీలక ప్రకటన

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమించి సాధించుకున్న ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు మళ్లీ పోరాటం సాగుతోంది.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు దీనికి వ్యతిరేకంగా కార్మికులు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఇక, వివిధ రాజకీయ పార్టీలు వీరికి మద్దతు తెలుపుతూ వస్తున్నాయి.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే దిశ‌గా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా ఏపీలో అధికార పార్టీ వినూత్న నిర‌స‌న‌కు శ్రీకారం చుట్టింది. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు నిర‌స‌న‌గా తాము చేప‌ట్టబోయే పోరాటంలో మ‌రిన్ని పార్టీల‌ను భాగ‌స్వామ్యం చేసే దిశ‌గా ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇందులో భాగంగా 120 మందికిపై ఎంపీల‌తో సంత‌కాలు చేయించి.. దానిని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఇవ్వాలని నిర్ణయించింది.. మరోవైపు.. ఇవాళ లోక్‌సభలో విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఉక్కశాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌..

Read Also: Ukraine Russia War: రష్యాలో దారుణ పరిస్థితులు.. షుగర్‌ కోసం స్ట్రీట్ ఫైట్స్..

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో పెట్టుబ‌డుల ఉపసంహ‌ర‌ణ‌ తప్పదని క్లారిటీ ఇచ్చారు ఉక్కుశాఖ మంత్రి రామ‌చంద్ర ప్రసాద్ సింగ్‌.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వానిది స‌మ‌ుచిత నిర్ణయమన్న ఆయన.. స్టీల్ ప్లాంట్‌కు భూములిచ్చిన రైతుల కుటుంబాల‌కు ఉద్యోగాలు ఇచ్చాం.. వారికి నష్టప‌రిహారం స‌హా అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించామని.. విశాఖ స్టీల్ ప్లాంట్ డిజిన్విస్ట్‌మెంట్ స‌రైన నిర్ణయంగా పేర్కొన్నారు.. పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ వ‌ల్ల కంపెనీలు ప్రగతి సాధించాయని 2019-20 ఆర్థిక స‌ర్వే వెల్లడించిందని లోక్‌సభలో తెలిపిన ఆయన.. పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ త‌ర్వాత ఆయా కంపెనీలు ఆర్ధికంగా బలోపేతం అయినట్టు చెప్పుకొచ్చారు. పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ అంశాన్ని పునఃప‌రిశీలించాల్సిన అవ‌స‌రం లేదని స్పష్టం చేశారు రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌.. “క్యాప్టివ్ మైన్స్” లేకున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ గ‌తంలో లాభాలు ఆర్జించిందన్న ఆయన.. ఉత్పాద‌క‌త త‌గ్గిపోయింది, కెపాసిటి యుటిలైజేష‌న్ త‌గ్గిపోయింది.. విశాఖ స్టీల్ ప్లాంట్ విస్తర‌ణ వ‌ల్ల అప్పులు పెరిగిపోయాయి.. 7 వేల కోట్ల రూపాయలు న‌ష్టాలు వచ్చాయని.. అందుకే, పెట్టబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ త‌ప్పదని స్పష్టం చేశారు.. దీని వ‌ల్ల ప్లాంట్ అభివృద్ధి జ‌రుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.