Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఢిల్లీలో సీఎం మమత.. భద్రతగా బెంగాల్ పోలీసులు.. ఏం జరుగుతోంది?

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం హస్తినలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ వేదికగా ‘సర్’పై పోరాటం చేస్తున్నారు. సోమవారం మమతతో పాటు మరో ఇద్దరికి ఎన్నికల సంఘం అపాయింట్‌మెంట్ ఇచ్చింది. దీంతో ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను మమత కలిశారు. అనంతరం ఆమె బయటకు వచ్చి జ్ఞానేష్ కుమార్ తనను అవమానించారని…అగౌరవపరిచారని ఆరోపించారు. అందుకే ఈసీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పారు. అయినా కూడా ఎన్నికల సంఘం నుంచి న్యాయం జరుగుతుందని ఆశించడం భ్రమ అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనతో జ్ఞానేష్ కుమార్ చెడుగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. అయితే మమత బెనర్జీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఆమెనే టేబుల్‌ను గట్టిగా కొట్టి వెళ్లిపోయారని తెలిపింది.

వారం వ్యవధిలో మోడీ రెండు బిగ్ డీల్స్.. భారత్‌కు కలిసొచ్చేదెంత?

2026 సంవత్సరం భారతదేశానికి కలిసొచ్చినట్లు అనిపిస్తోంది. గతేడాది అంతా గందరగోళంగా ఉంటే.. ఈ ఏడాది మాత్రం ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. మొన్నటికి మొన్న యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. ఇలా ఒప్పందం జరిగిందో లేదో.. వారం రోజుల వ్యవధిలోనే మరో బిగ్ డీల్ జరిగింది. తాజాగా అగ్ర రాజ్యం అమెరికాతో కీలక ఒప్పందం జరిగింది. భారత్‌పై విధించిన సుంకాన్ని 18 శాతానికి ట్రంప్ తగ్గించారు. ఇది 140 కోట్ల మంది ప్రజలకు శుభవార్తగా ప్రధాని మోడీ పేర్కొన్నారు.

మంత్రి పంకజ ముండేకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా..!

దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదం మరువక ముందే.. మరో మంత్రి పంకజ ముండేకు హెలికాప్టర్‌ ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్.. టేకాఫ్ నిలిపివేశారు. దీంతో మంత్రితో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే ఛత్రపతి శంభాజీనగర్ నుంచి లాతూర్‌కు హెలికాప్టర్‌లో బయల్దేరారు. అయితే హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే పైలట్ టేకాఫ్ అవ్వకుండా నిలిపివేశారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం పంకజ ముండే సంభాజీనగర్ నుంచి లాతూర్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణించాల్సి ఉందని వర్గాలు తెలిపాయి. అయితే పైలట్ సాంకేతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్ నిలిపివేశారు. దీంతో మంత్రి లాతూర్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

మాపై దాడి చేసి తిరిగి మా పైనే కేసులా?.. రేపు అనే రోజు ఒకటి ఉంటుంది గుర్తుంచుకోండి..!

రాష్ట్రంలో జరుగుతోన్న తాజా పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి విడదల రజని.. తిరుమల లడ్డూ విషయంలో క్షమాపణ చెప్పమన్నందుకు సీఎం చంద్రబాబు హింసను రాజేస్తున్నారని ఆరోపించారు.. వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ను టార్గెట్ చేసి హత్యాయత్నం చేశారని మండిపడ్డారు.. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి ఆర్గనైజ్డ్ గా టీడీపీ వాళ్లతో దాడి చేయించారు.. కార్యకర్తలను అంబటి ఇంటి మీదకు తీసుకెళ్లారు.. మళ్లీ వస్తాం.. మల్లా కొడతాం అని ఎమ్మెల్యే మాధవి మరోసారి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. అసలు మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో చూసుకోండి.. రేపు అనే రోజు ఒకటి ఉంటుంది అది గుర్తుంచుకోండి అని హెచ్చరించారు..

పారిశుద్ధ్య కార్మికురాలికి గిఫ్ట్ ఇచ్చిన సూపర్‌ స్టార్.. ఇది నిజాయితీకి దక్కిన గుర్తింపు!

నిజాయితీకి రోజులు లేవని అనే వారికి ఈ ఘటన ఒక మంచి ఉదాహరణ. నిజానికి మీలో ఎవరికైనా 45 తులాల బంగారు గొలుసు రోడ్డుపై దొరికితే ఏం చేస్తారు.. ఎవరు మనల్ని చూడటం లేదుగా అని చూసి, ఆ గొలుసును తీసుకొని జేబులో వేసుకుంటామా లేదా. కానీ ఈవిడ మాత్రం అలా చేయలేదు. తనకు దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన తన నిజాయతీని చాటుకుంది ఒక పారిశుద్ధ్య కార్మికురాలు. నిజాయితీకి ఉండే పవర్ ఎలాంటిది అంటే.. ఈ విషయం సూపర్ స్టార్ రజనీకాంత్ దృష్టికి వెళ్లింది. అసలు ఏం జరిగిందంటే..

కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న డిమాండ్‌పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ కార్యాలయం నుండి అధికారికంగా నోటీసులు జారీ అయ్యాయి.

భారత రైతులకు భద్రత, వెనిజులా నుంచి చమురు.. భారత్-యూఎస్ డీల్‌..

భారత్-అమెరికా మధ్య ప్రతిష్టాత్మక ట్రేడ్ డీల్ ఓకే అయింది. భారత్‌పై ట్రంప్ విధించిన పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఇదిలా ఉంటే, భారత రైతులు ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలిగించలేదని ట్రేడ్ డీల్‌పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ‘‘ఆంక్షలు లేని’’ దేశాల నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే రెండో అతిపెద్ద దేశంగా ఉంది, అయితే, ఇప్పుడు రష్యా అమెరికా ఆంక్షల కింద ఉంది. దీంతో భారత్ రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయమని పరోక్షంగా చెప్పినట్లు అయింది.

జనసేన కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ పూర్తి.. ఇక నిర్ణయం అధినేత చేతుల్లో!

మహిళా ఆరోపణల నేపథ్యంలో వివాదాల్లో చిక్కుకున్న జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ పూర్తయింది. గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీధర్, పార్టీ ఆదేశాల మేరకు కమిటీ ముందు హాజరై తన వాదనను వినిపించినట్లు సమాచారం. శివశంకర్, టీసీ వరుణ్, రమాదేవితో కూడిన త్రిసభ్య కమిటీ ఈరోజు రైల్వే కోడూరుకు చేరుకుని ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను ప్రత్యక్షంగా విచారించింది. దాదాపు గంటన్నరపాటు జరిగిన విచారణలో శ్రీధర్ తన వద్ద ఉన్న ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఇచ్చిన వివరణ, సమర్పించిన ఆధారాల వివరాలు మాత్రం బయటకు వెల్లడికాలేదు. గత కొన్ని రోజులుగా మహిళతో కలిసి ఉన్న వీడియోలు, అసెంబ్లీ నుంచే వీడియో కాల్ చేసిన క్లిప్స్ బయటకు రావడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన జనసేన పార్టీకి పెద్ద సవాలుగా మారడంతో వెంటనే శ్రీధర్‌ను సస్పెండ్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పార్టీ అధిష్టానం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

గుంటూరుకు వైఎస్ జగన్.. అంబటి కుటుంబానికి పరామర్శ!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఫిబ్రవరి 4) గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ ఈ పర్యటన చేపడుతున్నారు. జగన్ రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు జిల్లాకు బయలుదేరనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకోనున్నారు.

లోక్‌సభ నుంచి 8 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే ప్రచురించని పుస్తకాన్ని పేర్కొంటూ, భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో వ్యాఖ్యానించడంతో సోమవారం వివాదం ప్రారంభమైంది. ఈ వ్యాఖ్యల్ని హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉంటే, మంగళవారం లోక్‌సభలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. విపక్ష సభ్యులు సభాపతి చైర్ వైపు కాగితాలను విసిరేశారు. దీంతో 8 మంది ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ సస్పెండ్ చేసింది. రాహుల్ గాంధీ ప్రసంగానికి బీజేపీ ఎంపీలు అభ్యంతరం చెప్పడంతో ఈ ఘటన జరిగింది. సస్పెండ్ అయిన 8 మంది ఎంపీల్లో ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, గుర్జీత్ ఓజ్లా, రాజా వారింగ్, ఎబి ఈడెన్, కిరెన్ రెడ్డి, వెంకట్ రామన్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. స్పీకర్ ఈ సంఘటనను ఖండించారు. పార్లమెంటరీ మర్యాదను ఉల్లంఘనగా అభివర్ణించారు. బడ్జెట్ సమావేశాల సమయంలో ఇలాంటి చర్యల్ని సహించేది లేదని చెప్పారు. ఏప్రిల్ 2న ముగియనున్న బడ్జెట్ సమావేశాల వరకు వీరిపై సస్పెన్షన్ అమలులో ఉంటుంది.

 

Exit mobile version