RK Roja: తిరుపతి డీబీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం చర్చా గోష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ అభివృద్ధిని విస్మరించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎత్తిపోతల పథకానికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేని ప్రభుత్వం, అమరావతి పేరుతో రూ.2 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే రెండేళ్లలో అమరావతికి రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారని, అదే వేగంతో కొనసాగితే ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 100 ఏళ్లకుపైగా పడుతుందని విమర్శించారు.
Read Also: స్టైలిష్ లుక్స్, శక్తివంతమైన ఇంజిన్తో Volkswagen Taigun.. ఈ SUV మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే..?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం చేసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు రోజా.. రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ పథకాన్ని నిలిపివేయడం అంటే ఈ ప్రాంత ప్రజల గొంతు కోయడమేఅన్నారు.. 87 శాతం పూర్తయిన ఎత్తిపోతల ప్రాజెక్ట్ను వెంటనే పూర్తి చేస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని.. ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పాదయాత్ర చేపట్టి మహా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా..