ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో పులులు, చిరుత పులులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. కొమురం భీం జిల్లా దహెగాం మండలం ఖర్జీ అటవీ ప్రాంతంలో మేకలమందపై పులి దాడి చేసింది. దీంతో భయభ్రాంతులకు గురైన కాపరి మహేష్ చెట్టుపైకి ఎక్కి గ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు.
అనంతరం ఎఫ్బీఓలు మధుకర్, రమేష్, రాకేష్, గ్రామస్తులు వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పులి అడవి పందిని తింటుండగా మేకల మంద రావడంతో దాడికి యత్నించినట్లుగా గుర్తించారు. పులిదాడితో ఎటువంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ పులుల సంచారం జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం తిమ్మాపురం గ్రామంలో చిరుత పులి సంచారంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. చిరుత పులి గొర్రెల మందపై దాడి చేయడంతో 20 గొర్రెలు మృతి చెందాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పులిని బంధించి, తమను రక్షించాలని గ్రామస్తులు అటవీ అధికారులను కోరుతున్నారు.