ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతల పంచాయతీ హాట్ టాపిక్గా మారింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు మధ్య కొంతకాలంగా గ్రూప్ తగాదాలు ఉన్నా.. ఇప్పుడు అవి పీక్స్కు చేరాయి. ఈ విషయం సీఎం ఆఫీసు వరకు వెళ్లింది. దీంతో వీరిద్దరి వ్యవహారం త్వరగా తేల్చాలని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఈరోజు సాయంత్రం క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు. వల్లభనేని వంశీమోహన్, దుట్టా రామచంద్రరావుతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారులు ప్రత్యేకంగా సమావేశమై గన్నవరం పంచాయతీపై చర్చించారు.
ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎన్టీవీతో దుట్టా రామచంద్రరావు మాట్లాడారు. తమను సజ్జల, ధనుంజయ్ రెడ్డి రమ్మని పిలిచారని.. వారికి గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలన్నీ చెప్పామని తెలిపారు. తన అల్లుడు మీద వంశీ ఆరోపణలు చేశారని.. అందుకే తాను కూడా కలెక్టర్కు మట్టి తవ్వకాలపై లేఖ రాసినట్లు వివరించారు. అధిష్టానానికి తాము చెప్పాల్సింది చెప్పామని.. అయితే మరోసారి కలుద్దామని వాళ్లు చెప్పారని దుట్టా రామచంద్రరావు వెల్లడించారు.