Gurazala Mining Issues: పల్నాడులో మార్మోగుతోన్న కేజీఎఫ్ సినిమా పేరు..

Gurazala

Gurazala

Gurazala Mining Issues: కొన్ని సినిమా స్టోరీలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.. అందులో తీసుకున్న సెంటర్‌ పాయింట్.. అందరినీ కట్టిపడేస్తోంది.. ఇక, కేజీఎఫ్‌ సినిమా ఎంతో మంది ఆదరణ పొందింది.. రెండో భాగం కూడా వచ్చింది.. మూడో భాగం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.. అయితే, పల్నాడు జిల్లాలో కేజీఎఫ్ సినిమా పేరు మార్మోగుతోంది. గురజాల నియోజవర్గంలో కేజీఎఫ్ రేంజ్ లో మైనింగ్ సాగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. అవన్నీ కట్టుకథలంటూ కొట్టిపారేసిన వైసీపీ…టీడీపీ హయాంలోనే అక్రమ మైనింగ్ సాగిందని ఎదురుదాడికి దిగుతోంది.

Read Also: Employees: ప్రభుత్వంలో ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు.. నేతల స్పందన ఇలా..

పల్నాడు జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. గురజాల నియోజకవర్గంలోని అటవీ భూముల్లో అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారని, కూలీల ప్రాణాలను పణంగా పెట్టి వేల కోట్లు సంపాదిస్తున్నారని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించడంతో దుమారం రేగింది. దీనికి అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా ఘాటుగానే జవాబు ఇస్తోంది. అసలు 2014 నుంచి 2019 వరకు గురజాల నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల దోపిడీ చేసింది టీడీపీ నాయకులేనని రివర్స్ అటాక్ చేస్తోంది. అక్రమ మైనింగ్ ఆరోపణలపై బహిరంగ చర్చకి సిద్ధమేనని కాసు మహేష్ రెడ్డి అంటుంటే, మాచవరం మండలం రేగుల గడ్డ అక్రమ తవ్వకాలపై నిగ్గుతేలుస్తామని టీడీపీ అంటోంది. రిజర్వ్ ఫారెస్ట్ లో కృష్ణానదిని పూడ్చి మరీ మైనింగ్ చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నిస్తోంది. మొత్తానికి అక్రమ మైనింగ్ పై టీడీపీ, వైసీపీ నేతల పరస్పర ఆరోపణలు పల్నాడు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.