కృష్ణా జిల్లా ఏపీ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీ హాట్ పాలిటిక్స్ నడుస్తుంటాయి. తాజాగా నూజివీడులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజకీయ నాయకుల హౌస్ అరెస్ట్ ఉద్రిక్తతకు దారితీసింది. అభివృద్ధికి మేము కారణం అంటే.. మేము కారణం అంటూ ఇరు రాజకీయపార్టీలు సవాళ్లు విసురుకోవడంతో ముందస్తు చర్యగా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
రాజకీయ పార్టీల నాయకుల సవాళ్ళతో శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లకుండా పోలీసులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. ఈ మేరకు పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాజకీయ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. భారీ పోలీస్ బలగాల మోహరింపుతో నూజివీడు రాజకీయం సమ్మర్ హీట్ ని తలపిస్తోంది. శాంతి భద్రతల కారణంగా ఏ పార్టీ వారికి అనుమతివ్వలేదు పోలీసులు. చర్చకు రెండు పార్టీల నేతలు రెడీగా వున్నా పోలీసులు ససేమిరా అన్నారు. నూజివీడు గాంధీ బొమ్మ సెంటర్లో పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ 144 సెక్షన్ అమలుచేస్తున్నారు పోలీసులు.