NTV Telugu Site icon

Varla Ramaiah: సజ్జల చేతుల్లో సీఐడీ పావుగా మారింది

Varla Ramaiah

Varla Ramaiah

ఏపీ సీఐడీ దారి తప్పిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఐడీ ఏ దిక్కు వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉందని.. ప్రతిపక్ష పార్టీల మీద కక్ష తీర్చుకునే విషయంలో అధికార పార్టీకి సీఐడీ పావుగా ఉపయోగపడుతోందని వర్ల రామయ్య ఆరోపించారు. సజ్జల చేతుల్లో సీఐడీ పావుగా మారిందన్నారు. సీఐడీ చీఫ్ సునీల్ కుమారుడిని సీఎం జగన్, సజ్జల బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వర్ల రామయ్య విమర్శలు చేశారు. సునీల్ కుమార్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో సునీల్ కుమారుడిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు కన్పిస్తోందన్నారు.

సునీల్ కుమార్ మీద ఒత్తిడి తెచ్చి సీఐడీ ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని వర్లరామయ్య మండిపడ్డారు. సీఎం జగన్, సజ్జల చేతుల్లో తాను ఎందుకు పావుగా మారాల్సి వచ్చిందో సీఐడీ చీఫ్ నోరువిప్పాలన్నారు. పంచ్ ప్రభాకర్ మీద సీబీఐ లుక్ అవుట్ నోటీసిస్తే.. ఆయన్ను విదేశాల్లో ఎంపీ మిధున్ రెడ్డి కలిశారని.. సీఎం జగన్‌ను పంచ్ ప్రభాకర్ కలిశారని.. లుక్ అవుట్ నోటీసు పరిధిలో ఉన్న పంచ్ ప్రభాకర్‌ను ఎంపీ మిధున్ రెడ్డి స్థానిక పోలీసులకు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. పంచ్ ప్రభాకర్, మిధున్ రెడ్డి భేటీ విషయాన్ని హైకోర్టు కూడా సీరియస్‌గా తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు. ఎవరికీ అంతు చిక్కని కేసులను విచారణ చేయాల్సిన సీఐడీ విభాగాన్ని ఇలాంటి కేసులకు ఉపయోగించుకుంటారా అంటూ నిలదీశారు.

Tammineni Sitaram: మీటర్ సిస్టమ్ పెట్టిందే చంద్రబాబు

గౌతు శిరీషను ఏడు గంటల పాటు విచారణ చేస్తారా.. భోజనానికి కూడా వెళ్లనివ్వకుండా శిరీషను విచారిస్తారా.. అసలు ఆమె ఏం తప్పు చేశారని.. గౌతు లచ్చన్న మనవరాలిని అవమానిస్తారా అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు. డ్రైవర్‌ను హత్య చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును కూడా ఇన్ని గంటలపాటు విచారణ చేయలేదని వర్ల రామయ్య ఆరోపించారు. లోకేష్ పేరు చెప్పమని విచారణకు పిలిచిన వారిని ఒత్తిడి తెస్తున్నారని.. లోకేష్ మీద ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. పప్పు అని లోకేష్ గురించి ప్రచారం చేశారు.. కానీ ఇప్పుడు ఆయన నిప్పుగా మారారన్నారు.

సీఐడీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించడం సరికాదని వర్ల రామయ్య హితవు పలికారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ 26 ఫిర్యాదులు చేశాను.. ఏం చర్యలు తీసుకున్నారని సీఐడీని వర్లరామయ్య ప్రశ్నించారు. సోషల్ మీడియా కేసులపై అధికారంలోకి రాగానే ఓ కమిషన్ వేస్తామని.. తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో సీఐడీ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.