తెలుగునాట రాజకీయ యవనికపై ఒక ప్రభంజనంలా ఉద్భవించిన తెలుగుదేశం పార్టీ నేడు 44వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతిలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఈ ప్రస్థానంలో పార్టీ ఎన్నో చారిత్రాత్మక విజయాలను నమోదు చేయడమే కాకుండా, ఎన్నెన్నో సంక్షోభాలను, కుట్రలను ధీటుగా ఎదుర్కొని నిలబడిందని ఆయన గుర్తుచేశారు. టీడీపీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు అని, రాష్ట్రాభివృద్ధికి అది ఒక ఇంజిన్ లాంటిదని చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
Chicken Price: చికెన్ షాపుల ముందు క్యూ కట్టిన జనాలు.. కారణం ఇదే..
పార్టీ ఉనికిని కాపాడటంలో కార్యకర్తలు చేసిన త్యాగాలను ముఖ్యమంత్రి కొనియాడుతూ, టీడీపీ ఈ స్థాయిలో ఉందంటే అది లక్షలాది మంది కార్యకర్తల ప్రాణత్యాగాలు, ఆస్తుల నష్టాలు , వారి నిరంతర శ్రమ వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో (2019-24) పార్టీని ఫినిష్ చేస్తామని కంకణం కట్టుకున్న వారే నేడు రాజకీయంగా కనుమరుగయ్యారని, పసుపు జెండాను అంగుళం కూడా ఎవరూ కదిలించలేరని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా తనపై జరిగిన అలిపిరి హత్యాయత్నం నుండి మొదలుకొని, ఇటీవలి జైలు జీవితం వరకు ఎదురైన సవాళ్లన్నీ కార్యకర్తల అండతోనే అధిగమించగలిగానని తెలిపారు. కార్యకర్తలను పట్టించుకోని నేతలకు పార్టీలో చోటు లేదని, సమర్థంగా పనిచేసే వారికే భవిష్యత్తులోనూ గుర్తింపు ఉంటుందని మంత్రులు, ఎమ్మెల్యేలకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. కార్యకర్తల సంక్షేమ బాధ్యతను నారా లోకేష్ చూస్తారని, ట్రస్ట్ ద్వారా వారి పిల్లల చదువులకు, కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Nara Lokesh: కార్యకర్తలే పార్టీ బలం.. టీడీపీ ఆవిర్భావ సభలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు!
రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు తన వైఖరిని మరోసారి కుండబద్దలు కొట్టారు. “అమరావతి దేవతల రాజధాని, అందుకే కొందరు రాక్షసులకు ఇది నచ్చలేదు” అంటూ పరోక్షంగా గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇకపై రాష్ట్రంలో మూడు ముక్కలాటలు ఉండవని, ‘ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని’ అనే సూత్రంపైనే తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తేల్చి చెప్పారు. 2028 ఆగస్టు నాటికి అమరావతిలో ప్రధాన నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి, స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగానే ప్రారంభిస్తామని ఒక చారిత్రాత్మక గడువును ప్రకటించారు. అమరావతిని ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వృధా పోదని ఆయన హామీ ఇచ్చారు.
ప్రభుత్వ అభివృద్ధి , సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, ఎన్నికల ముందు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను ఇప్పటికే ‘సూపర్ హిట్’ చేశామని చంద్రబాబు తెలిపారు. సామాజిక పెన్షన్లను దేశంలోనే ఎక్కడా లేని విధంగా పెంచామని, విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా కూడా పెంచకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. 6.28 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ద్వారా యువతకు భరోసా ఇచ్చామన్నారు. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సీట్లు 50 శాతం పెరుగుతాయని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయని, దీనివల్ల పార్టీలో కొత్త నాయకత్వానికి పెద్దపీట వేస్తామని వెల్లడించారు. టీడీపీ బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా ఉంటుందని, వచ్చే అన్ని ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని పిలుపునిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
