Site icon NTV Telugu

BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

Bv Raghavulu Cpm

Bv Raghavulu Cpm

BV Raghavulu: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయంలో హాట్‌ కామెంట్లు చేశారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శిల్పారామంలో జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పాల్గొన్న రాఘవులు.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర విభజనకు 12 సంవత్సరాలు పూర్తయినా ఇంకా ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధాని లేకపోవడం బాధాకరమని రాఘవులు పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఒకవైపు, మాజీ సీఎం వైఎస్‌ జగన్ మరోవైపు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజధాని అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారని, అందుకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.

Read Also: CM Chandrababu: మొన్న మూడుముక్కలాట.. నిన్న మావిగన్.. వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు..

ఇక, వైఎస్‌ జగన్‌పై నేరుగా విమర్శలు చేస్తూ, ఆయనకు రాజకీయంగా మెచ్యూరిటీ లేదని రాఘవులు అన్నారు. మొన్నటి వరకు మూడు రాజధానులు అంటూ మాట్లాడిన ఆయన, ఇప్పుడు ఆ అంశాన్ని వదిలేసి ఇతర విషయాలపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని ఏర్పడే సమయంలో అందరూ ఆనందించి, సహకరించాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. మెచ్యూరిటీ లేకుండా మాట్లాడటం రాజకీయ నాయకులకు తగదని వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి చురకలు అంటించారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు..

Exit mobile version