రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లక్షలాదిమంది భక్తుల రాకతో పులకించింది. అక్కడ ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహం కనులవిందుగా కనిపించింది. శ్రీరామనుజుల కీర్తి దశదిశలా మరోమారు వ్యాపించింది. సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీరామనగరంలో 12 రోజుల పాటు జరిగిన మహా క్రతువులో వేలాది మంది రుత్వికులు.. లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అంకురార్పణ నుంచి మహా పూర్ణాహుతి వరకు నిత్యం ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు.
భారత దేశానికి చెందిన అతిరథ మహారథులు, రాజకీయ ప్రముఖులు సమతామూర్తిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొన్నారు. భారత దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్, సీఎం జగన్, సినీ ప్రముఖులు.. వేడుకల్లో భాగస్వాములయ్యారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహం సహా బంగారు ప్రతిమను ఆవిష్కరించారు. ప్రతిరోజు అష్టాక్షరీ మంత్ర పఠనం, విష్ణు సహస్ర పారాయణం చేశారు. యజ్ఞంలో భాగంగా యాగశాలలోని నాలుగు మండపాల్లో విశ్వక్సేనేష్టి, నారసింహఇష్టి, లక్ష్మీనారాయణ ఇష్టి, పరమేష్టి, వైభవేష్ఠి, హయగ్రీవఇష్టి, వైయూహికఇష్టి, సుదర్శన ఇష్టి, వైనతేఇష్టిలను శాస్త్రోక్తంగా చేశారు. 1035 హోమ కుండాల్లో 5 వేల మంది రుత్వికులు.. లక్ష్మీనారాయణ మహా యజ్ఞాన్ని జరిపారు. చివరి రోజు ఆ యాగానికి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో రుత్వికులు మహా పూర్ణాహుతి పలికారు.108 ఆలయాల్లో దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠ చేసి నిత్యారాధనకు సిద్ధం చేశారు. దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి సమతామూర్తిని దర్శించుకున్నారు.లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో భాగస్వాములైన వేలాది మంది ఋత్వికులను సన్మానించేందుకు శాంతి కల్యాణాన్ని వాయిదా వేసినట్లు చినజీయర్ స్వామి తెలిపారు. కల్యాణ మహోత్సవాన్ని చరిత్రలో గుర్తుండేలా.. ఈ నెల 19న నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ సహస్రాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. 8 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. 1200 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది, 380 అగ్నిమాపక సిబ్బంది, 25 ఆరోగ్య సిబ్బందితో పాటు వికాస తరింగిణి నుంచి 12 వేల మంది కార్యకర్తలు సహస్రాబ్ది వేడుకల్లో సేవలందించారు. ఎన్టీవీ, భక్తిటీవీ ఈ విశేష కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న భక్తులు చూసే భాగ్యం కలిగించింది.